మహిళల క్రికెట్‌లో సరికొత్త చరిత్ర.. ఇండియా-పాక్‌ మ్యాచ్‌కు రికార్డు వ్యూయర్ షిప్!

  • మహిళల క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణ
  • మ్యాచ్‌ను వీక్షించిన దాదాపు 2.84 కోట్ల మంది  
  • గత ప్రపంచకప్‌ కన్నా 12 రెట్లు అధిక వాచ్‌టైమ్‌
  • ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్‌కూ భారీ స్పందన
మహిళల క్రికెట్‌కు ఆదరణ అనూహ్యంగా పెరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌కు ప్రేక్షకుల నుంచి అపూర్వ స్పందన లభించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), జియో హాట్‌స్టార్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఈ మ్యాచ్‌ను ఏకంగా 2.84 కోట్ల మంది వీక్షించారు. వాచ్‌టైమ్ పరంగా చూస్తే ఇది 187 కోట్ల నిమిషాలుగా నమోదైంది. మహిళల క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక వ్యూయర్‌షిప్‌ కావడం విశేషం.

ప్రస్తుత ప్రపంచకప్‌లో తొలి 13 మ్యాచులను సుమారు 6 కోట్ల మంది చూడగా, మొత్తం వీక్షణ సమయం 700 కోట్ల నిమిషాలు దాటింది. గత ప్రపంచకప్‌తో పోలిస్తే వాచ్‌టైమ్ ఏకంగా 12 రెట్లు పెరగడం మహిళల క్రికెట్‌కు పెరుగుతున్న క్రేజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. చిరకాల ప్రత్యర్థులైన పాకిస్థాన్‌తోనే కాకుండా, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌కు కూడా మంచి ఆదరణ లభించింది. ఈ మ్యాచ్‌ను దాదాపు 48 లక్షల మంది వీక్షించారు.

లీగ్ దశలో టీమిండియా ఇంకా ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో కీలకమైన మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. సెమీ ఫైనల్స్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లలో గెలవడం భారత్‌కు చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో రాబోయే మ్యాచులకు వ్యూయర్‌షిప్‌ మరింత పెరిగి మరిన్ని రికార్డులు నమోదయ్యే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్ నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండింటిలో గెలిచి, రెండింటిలో ఓటమి పాలైంది.


More Telugu News