చంద్రబాబు హిందీ స్పీచ్‌కు మోదీ ఫిదా.. లోకేశ్‌కు ప్రత్యేక అభినందనలు

  • కర్నూలు సభలో చంద్రబాబు హిందీ ప్రసంగంపై ప్రధాని మోదీ ప్రశంస
  • చక్కటి హిందీతో ఎన్డీయే కార్యకర్తల మనసు గెలిచారంటూ కితాబు
  • ‘సూపర్ జీఎస్టీ’ ప్రచారంపై మంత్రి లోకేశ్‌కు ప్రత్యేక అభినందనలు
  • యువతకు జీఎస్టీపై అవగాహన కల్పించారని కొనియాడిన మోదీ
  • సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ప్రధానమంత్రి
  • ప్రధాని అభినందనలకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి లోకేశ్
ఏపీ సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ల పనితీరుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. తండ్రీకొడుకులిద్దరినీ అభినందిస్తూ ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో వేర్వేరుగా పోస్టులు పెట్టారు.

బాబూ.. మీ హిందీ భేష్‌
కర్నూలులో జరిగిన ఓ సభలో చంద్రబాబు హిందీలో ప్రసంగించడంపై ప్రధాని మోదీ ప్రత్యేకంగా స్పందించారు. చంద్రబాబు అద్భుతమైన హిందీలో మాట్లాడి ఎన్డీయే కార్యకర్తల మనసు గెలుచుకున్నారని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే గెలుపుపై చంద్రబాబు వ్యక్తం చేసిన విశ్వాసాన్ని ఆయన స్వాగతించారు. ఈ ప్రసంగం ద్వారా ‘ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్’ పట్ల చంద్రబాబుకు ఉన్న బలమైన నిబద్ధత బయటపడిందని మోదీ తన పోస్టులో అభినందించారు.

లోకేశ్‌పై ప్ర‌ధాని ప్రశంసలు
మరోవైపు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌పై కూడా ప్రధాని మోదీ ప్రశంసలు గుప్పించారు. రాష్ట్రంలో ‘సూపర్ జీఎస్టీ... సూపర్ సేవింగ్స్’ పేరుతో చేపట్టిన ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు లోకేశ్‌ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. వినూత్నమైన పద్ధతుల్లో ప్రచారం నిర్వహించి, యువతకు జీఎస్టీపై అవగాహన కల్పించడంలో లోకేశ్ ప్రత్యేక చొరవ చూపారని మోదీ కొనియాడారు.

ప్రధాని అభినందనలపై మంత్రి లోకేశ్ స్పందిస్తూ ధన్యవాదాలు తెలిపారు. “జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశంలో పన్నుల వ్యవస్థలో గొప్ప మార్పులు వచ్చాయి, దేశ ఆదాయం కూడా పెరుగుతోంది. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మా రాష్ట్ర ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు” అని లోకేశ్ పేర్కొన్నారు.


More Telugu News