Diwali: పండక్కి ఊరెళ్తున్నారా?... ప్రైవేట్ బస్సుల్లో బాదుడే బాదుడు!

Diwali Private Bus Fare Hike Leaves Passengers Stranded
షార్ట్స్‌లో చూడండి
దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి తమ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు చుక్కలు చూపిస్తున్నారు. వరుస సెలవులు రావడంతో పెరిగిన రద్దీని ఆసరాగా చేసుకుని టికెట్ ధరలను అమాంతం పెంచేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సాధారణ రోజుల్లో రూ. 500 ఉండే టికెట్ ధరను ఇప్పుడు రూ. 1000 నుంచి రూ. 1500 వరకు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ధరలపై ప్రభుత్వ నియంత్రణ కొరవడటంతోనే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఇలా దోపిడీకి పాల్పడుతున్నాయని పలువురు మండిపడుతున్నారు. పెరిగిన ధరలతో పండుగ పూట జేబులకు చిల్లు పడుతోందని వాపోతున్నారు.

ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు (టీజీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్‌ఆర్టీసీ) ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించాయి. పండుగ రద్దీని తగ్గించేందుకు ఈ అదనపు సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు, దక్షిణ మధ్య రైల్వే కూడా దీపావళి రద్దీని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 17 నుంచి 23 వరకు మొత్తం 26 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చర్లపల్లి, లింగంపల్లి స్టేషన్ల నుంచి విజయవాడ, తిరుపతి, చెన్నై, భువనేశ్వర్, యశ్వంత్‌పూర్‌ వంటి ప్రాంతాలకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి.

ఇక విమాన ప్రయాణాల విషయానికొస్తే, గతేడాది దీపావళితో పోలిస్తే ఈసారి టికెట్ బుకింగ్స్ 15 నుంచి 20 శాతం పెరిగాయని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. వీటిలో దాదాపు 65 నుంచి 70 శాతం వరకు విహార యాత్రల కోసమే కావడం గమనార్హం.
Go Back to Shorts
Diwali
Private buses
Ticket prices
TSRTC
APSRTC
Special trains
South Central Railway
Hyderabad
Vijayawada
Festival rush

More Telugu News