South Asian University: క్యాంపస్‌లోనే బీటెక్ విద్యార్థినిపై నలుగురి అఘాయిత్యం.. వర్సిటీలో ఉద్రిక్తత

 దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో దారుణం చోటుచేసుకుంది. సౌత్ ఏషియన్ యూనివర్సిటీ (ఎస్ఏయూ) క్యాంపస్‌లో ప్రథమ సంవత్సరం బీటెక్ చదువుతున్న విద్యార్థినిపై నలుగురు వ్యక్తులు లైంగికదాడికి యత్నించారు. బాధిత విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో క్యాంపస్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్మాణ పనులు జరుగుతున్న ఓ ప్రదేశంలో ఈ ఘటన జరిగిందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. "నలుగురు నిందితులు నా బట్టలు చించివేసి, అసభ్యంగా తాకుతూ అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు" అని ఆమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది.

సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. వెంటనే మైదాన్ గర్హీ పోలీస్ స్టేషన్ బృందాలు వర్సిటీకి చేరుకున్నాయి. తొలుత మోలస్టేషన్ కేసు నమోదు చేసిన పోలీసులు, బాధితురాలి నుంచి పూర్తి వాంగ్మూలం తీసుకున్న తర్వాత సామూహిక అత్యాచార యత్నం సెక్షన్లను కూడా జోడించారు. క్యాంపస్‌లో దాదాపు అన్ని చోట్లా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని, బాధితురాలు చెప్పిన ప్రాంతాల్లోని ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని పోలీస్ వర్గాలు తెలిపాయి.

ఈ దారుణ ఘటనతో యూనివర్సిటీలో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ విషయంపై యూనివర్సిటీ యాజమాన్యం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ, పోలీసుల దర్యాప్తుకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని స్పష్టం చేసింది. దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి (సార్క్) దేశాల ఒప్పందం ద్వారా ఏర్పాటైన ఈ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం విదేశాంగ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది.
South Asian University
Delhi
SAU
B.Tech student
sexual assault
campus violence
crime
Maidan Garhi Police Station
protest
SARC countries

More Telugu News