ఏపీ సమాచార శాఖ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన విశ్వనాథన్

  • విజయవాడ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోని ఐ అండ్ పీఆర్ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన విశ్వనాథన్
  • ఇటీవల కాలం వరకు కమిషనర్ గా ఉన్న హిమాన్షు శుక్లా నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా బదిలీ
  • ఆ తర్వాత ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహించిన ప్రఖర్ జైన్  
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖ నూతన కమిషనర్‌గా కె.ఎస్. విశ్వనాథన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు ఉదయం విజయవాడ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌లోని శాఖ రాష్ట్ర కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.

ఇంతకు ముందు ఈ పదవిలో ఉన్న హిమాన్షు శుక్లాను ప్రభుత్వం శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేయగా, ఆ స్థానంలో తాత్కాలికంగా ప్రఖర్ జైన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇటీవల ప్రభుత్వం విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్‌గా పనిచేస్తున్న కె.ఎస్. విశ్వనాథన్‌ను ఐ అండ్ పీఆర్ కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన విశ్వనాథన్ గతంలో అనంతపురం అసిస్టెంట్ కలెక్టర్‌గా, నరసాపురం సబ్ కలెక్టర్‌గా, అలాగే ప్రకాశం, విశాఖపట్టణం జిల్లాల జాయింట్ కలెక్టర్‌గా సేవలందించారు. ఐ అండ్ పీఆర్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన శాఖ కార్యకలాపాలు, విధుల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది నూతన కమిషనర్‌ను అభినందించారు. 


More Telugu News