ఫ్లోరా, శ్రీజ ఎలిమినేట్.. వైల్డ్ కార్డుతో బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆరుగురు ఎవ‌రంటే..!

  • బిగ్‌బాస్ 9లో అనూహ్యంగా డబుల్ ఎలిమినేషన్
  • హౌస్ నుంచి ఫ్లోరా సైనీ, శ్రీజ ఔట్
  • వైల్డ్ కార్డు ద్వారా ఏకంగా ఆరుగురు కొత్త సభ్యుల ఎంట్రీ
  • వారిలో సోషల్ మీడియా స్టార్లు దివ్వెల మాధురి, రమ్య మోక్ష
  • వైసీపీ ఎమ్మెల్సీతో వివాదంలో నిలిచిన మాధురి కూడా హౌస్‌లోకి
  • మరింత పెరగనున్న పోటీ, రచ్చ అంటున్న ప్రేక్షకులు
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 9 ఊహించని మలుపులతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తోంది. ఆదివారం ఎపిసోడ్‌లో నిర్వాహకులు భారీ షాక్ ఇచ్చారు. ఒకేసారి ఇద్దరు కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేయడమే కాకుండా, ఏకంగా ఆరుగురు కొత్త సభ్యులను వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి పంపించి ఆట స్వరూపాన్నే మార్చేశారు. ఈ అనూహ్య పరిణామంతో హౌస్‌లో సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం కనిపిస్తోంది.

ఈ వారం ప్రేక్షకుల నుంచి తక్కువ ఓట్లు రావడంతో ఫ్లోరా సైనీ, శ్రీజ హౌస్‌ను వీడారు. వీరిద్దరి ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే, నిర్వాహకులు ఒకరి తర్వాత ఒకరిగా ఆరుగురు కొత్త కంటెస్టెంట్లను స్టేజ్‌పైకి ఆహ్వానించి హౌస్‌లోకి పంపారు. సీరియల్ నటులు నిఖిల్ నాయర్, అయేషా, గౌరవ్ గుప్తాతో పాటు 'గోల్కొండ హైస్కూల్' ఫేమ్ శ్రీనివాస్ సాయి, సోషల్ మీడియా స్టార్లు దివ్వెల మాధురి, రమ్య మోక్ష (అలేఖ్య చిట్టి పికిల్స్) వైల్డ్ కార్డ్ ద్వారా రంగ ప్రవేశం చేశారు.

కొత్తగా వచ్చిన వారిలో సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉన్న దివ్వెల మాధురి, రమ్య మోక్ష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా టెక్కలి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో ఉన్న సంబంధాల కారణంగా మాధురి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. తనపై ఉన్న నెగెటివిటీని తొలగించుకుని, తానేంటో నిరూపించుకోవడానికే బిగ్‌బాస్‌కు వచ్చానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరూ ఎక్కువ కాలం నటించలేరని, కచ్చితంగా దొరికిపోతారని ఆమె అన్నారు.

మరోవైపు ‘అలేఖ్య చిట్టి పికిల్స్’ పేరుతో సోషల్ మీడియాలో, ముఖ్యంగా రీల్స్‌తో ఫేమస్ అయిన రమ్య మోక్ష తన గ్లామర్‌తో హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఈ కొత్త ఎంట్రీలతో బిగ్‌బాస్ హౌస్‌లో పాత, కొత్త సభ్యుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ భారీ మార్పులతో షో మరింత రసవత్తరంగా మారుతుందని, అసలైన రణరంగం ఇప్పుడే మొదలైందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.


More Telugu News