మహిళల ప్రపంచకప్: విశాఖలో టీమిండియాపై టాస్ గెలిచిన ఆసీస్

మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో నేడు భారత్, ఆస్ట్రేలియా జట్లు కీలక మ్యాచ్‌ లో తలపడుతున్నాయి. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ టాస్ గెలిచి వెంటనే ఫీల్డింగ్ ఎంచుకుంది. రాత్రి సమయంలో మంచు ప్రభావం చూపే అవకాశం ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేసింది.

మ్యాచ్ అనంతరం అలిస్సా హీలీ మాట్లాడుతూ, "నిన్న సాయంత్రం ప్రాక్టీస్ సమయంలో మంచు కురిసింది. రెండో ఇన్నింగ్స్‌లో బంతి బ్యాట్‌పైకి సులభంగా వస్తుందని భావిస్తున్నాను. అందుకే బౌలింగ్ ఎంచుకున్నాం" అని తెలిపింది. భారత బ్యాటర్ల బలహీనతను లక్ష్యంగా చేసుకుని, వ్యూహాత్మకంగా జట్టులో ఒక మార్పు చేసినట్లు ఆమె పేర్కొంది. జార్జియా వేర్‌హామ్ స్థానంలో ఎడమచేతి వాటం స్పిన్నర్ సోఫీ మోలినెక్స్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు వివరించింది.

మరోవైపు, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగడంపై భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సానుకూలంగా స్పందించింది. దక్షిణాఫ్రికాతో ఆడిన గత మ్యాచ్‌తో పోలిస్తే ఈ పిచ్ బ్యాటింగ్‌కు మరింత అనుకూలంగా కనిపిస్తోందని, కాబట్టి ముందుగా బ్యాటింగ్ చేయడం తమకు ఇబ్బందేమీ కాదని ఆమె అభిప్రాయపడింది. గత మ్యాచ్‌లో ఓడినప్పటికీ, అదే జట్టుతో బరిలోకి దిగుతున్నట్లు హర్మన్‌ప్రీత్ స్పష్టం చేసింది.

తుది జట్లు

భారత్: స్మృతి మంధన, ప్రతికా రావల్, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్‌జోత్ కౌర్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, ఎన్. శ్రీ చరణి.

ఆస్ట్రేలియా: అలిస్సా హీలీ (కెప్టెన్ & వికెట్ కీపర్), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, అనాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డనర్, తహిలా మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, కిమ్ గార్త్, అలానా కింగ్, మేగన్ షుట్.

Alyssa Healy
India vs Australia
Womens World Cup
Visakhapatnam
Harmanpreet Kaur
Smriti Mandhana
Cricket
Womens Cricket
ACA-VDCA Stadium
Sophie Molineux

More Telugu News