సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

  • ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
  • సీఎంగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు ప్రత్యేక అభినందనలు
  • చంద్రబాబు దార్శనికత, సుపరిపాలనను కొనియాడిన ప్రధాని
  • 2000ల నుంచే కలిసి పనిచేశామని గుర్తు చేసుకున్న మోదీ
  • ప్రధాని శుభాకాంక్షలకు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు
  • వికసిత భారత్‌లో స్వర్ణాంధ్రను కీలక శక్తిగా నిలుపుతామన్న సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అరుదైన మైలురాయిని పురస్కరించుకుని ప్రధాని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇరువురు నాయకుల మధ్య జరిగిన ఈ సంభాషణ వారి మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాన్ని మరోసారి చాటిచెప్పింది.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఆయన దార్శనికత, సుపరిపాలన పట్ల నిబద్ధత స్థిరంగా కొనసాగాయని ప్రశంసించారు. "2000ల ప్రారంభంలో తామిద్దరం ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటి నుంచి అనేక సందర్భాల్లో కలిసి పనిచేశాం," అని మోదీ గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం చంద్రబాబు ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారని, ఆయనకు అన్నివిధాలా శుభాకాంక్షలు తెలుపుతున్నానని మోదీ అన్నారు.

ప్రధాని మోదీ ఫోన్ కాల్, ఆయన తెలిపిన శుభాకాంక్షలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. "మీ దార్శనిక నాయకత్వంలో 'వికసిత భారత్' లక్ష్యాన్ని సాధించడంలో ఆంధ్రప్రదేశ్‌ను ఒక కీలక శక్తిగా నిలబెడతాం. మీ మద్దతుతో స్వర్ణాంధ్రను నిర్మించేందుకు నేను పూర్తి నిబద్ధతతో ఉన్నాను" అని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ దయతో కూడిన మాటలకు, ఆయన ఫోన్ కాల్ కు తాను ఎంతో సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. 


More Telugu News