అడవి పంది మాంసం తినేందుకు అనుమతివ్వాలి: కేరళ మంత్రి వ్యాఖ్యలు

అడవి పందులు పంట పొలాలను నాశనం చేస్తున్నాయని, వాటి నుంచి పంటలను కాపాడాలని తన వద్దకు వచ్చిన గ్రామస్తులకు ఒక మంత్రి ఇచ్చిన సమాధానం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ అడవి పందులను చంపి తినడమే మార్గమని, మరో మార్గం లేదని ఆయన సూచించడంతో గ్రామస్తులు కంగుతిన్నారు.

కేరళలోని పాలమేల్ గ్రామ పంచాయతీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో కేరళ వ్యవసాయ మంత్రి పి. ప్రసాద్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పంట పొలాలలో అడవి పందుల సమస్యను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరారు.

స్పందించిన మంత్రి, వాటిని చంపడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించదని అన్నారు. కానీ, పంట నష్టాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే అడవి పందులను చంపడమే మార్గమని అన్నారు. అడవిపందులను తినేందుకు కేంద్రం ప్రజలకు అనుమతులు ఇవ్వాలని సూచించారు. ఇలా చేయడం ద్వారా అడవి పందుల సమస్యను వేగంగా పరిష్కరించి పంటలను కాపాడుకోగలమని అన్నారు. వాటిని చంపకుండా ఉండాలని చెప్పడానికి అవేమీ అంతరించిపోతున్న జాతి కాదని వ్యాఖ్యానించారు.


More Telugu News