సీఐపై దౌర్జన్యం చేశారని పేర్ని నానిపై కేసు

  • మాజీ మంత్రి అనుచరులు 29 మందిపైనా ఎఫ్ఐఆర్
  • మచిలీపట్నం పీఎస్ లో సీఐతో పేర్ని నాని వాగ్వాదం
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ అధికారి విధులకు ఆటంకం కలిగించారని, ఆర్.పేట సీఐ ఏసుబాబుపై దౌర్జన్యం చేశారని చిలకలపూడి స్టేషన్ లో ఈ మేరకు కేసు నమోదైంది. మాజీ మంత్రితో పాటు ఆయన అనుచరులు మరో 29 మందిపైనా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అసలు ఏం జరిగిందంటే..
శుక్రవారం వైసీపీ నేత సుబ్బన్నను ఓ కేసు విచారణ కోసం పోలీసులు పిలిచారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన పేర్ని నాని సీఐ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు హల్‌చల్‌ చేశారు. సీఐతో పేర్ని నాని గొడవకు దిగారు. మెడికల్ కాలేజీ ధర్నా కేసులో తన అనుచరుడిని వేధిస్తున్నారని, విచారణ పేరుతో రోజూ స్టేషన్ కు పిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాగానే తానంటే ఏమిటో ఏపీ పోలీసులకు చూపిస్తానని పేర్ని నాని హెచ్చరించారు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తీవ్రంగా పరిగణించిన ఎస్పీ.. మాజీ మంత్రిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు.


More Telugu News