Tushar Mehta: పిల్లలను దీపావళి పండుగ జరుపుకోనివ్వండి: సుప్రీంకోర్టుకు ఢిల్లీ-ఎన్సీఆర్ రాష్ట్రాలు

కాలుష్య రహిత బాణసంచాతో పిల్లలు దీపావళి పండుగ జరుపుకోవడానికి అనుమతించాలని పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పిల్లలు దీపావళి రోజున బాణసంచా కాల్చడానికి ఎదురు చూస్తుంటారని తెలిపాయి. అయితే పర్యావరణహితమైన బాణసంచాతో వారిని పండుగ చేసుకోనివ్వాలని రాష్ట్రాలు కోరాయి.

ఈ మేరకు ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్ రాష్ట్రాలు - ఢిల్లీతో పాటు హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని రాజధాని ప్రాంత జిల్లాలు) రాష్ట్రాల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, న్యాయమూర్తి జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనాన్ని కోరారు.

ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉన్నందున బాణసంచా విక్రయాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఏప్రిల్ 3న తీర్పు వెలువరించింది. అయితే దీపావళి రోజున రాత్రి 8 నుంచి 10 గంటల వరకు పర్యావరణ హిత బాణసంచా కాల్చడానికి అనుమతివ్వాలని కోరారు.

కొన్ని షరతులతో ఎన్సీఆర్ పరిధిలో బాణసంచా ఉపయోగాన్ని అనుమతించవచ్చని కోర్టును కోరారు. జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధన సంస్థ ఆమోదించిన పర్యావరణ హిత బాణసంచా మాత్రమే తయారు చేసి, విక్రయించేలా సూచించాలని తుషార్ మెహతా కోరారు. అత్యధిక పేలుడు స్వభావమున్న టపాసులు తయారు చేయకుండా రాష్ట్రాలు, ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటాయని అన్నారు. వ్యాపారులు కూడా అనుమతి పొందిన క్రాకర్లను మాత్రమే విక్రయించేలా చూడాలని అన్నారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
Tushar Mehta
Diwali
Diwali crackers
Supreme court
Delhi NCR
firecrackers ban
air pollution

More Telugu News