జురెల్ కంటే శాంసనే బెటర్.. ఆ స్థానానికి అతడే కరెక్ట్: కైఫ్

  • ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు జట్టు ఎంపికపై కైఫ్ విమర్శలు
  • ధ్రువ్ జురెల్‌ ఎంపిక తప్పుడు నిర్ణయమన్న కైఫ్
  • 5వ, 6వ స్థానాల్లో బ్యాటింగ్ చేయడానికి శాంసనే బెస్ట్ అని అభిప్రాయం
  •  స్పిన్నర్లపై భారీ సిక్సర్లు కొట్టగల సామర్థ్యం సంజూకు ఉందని వెల్లడి  
 ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్ కోసం భారత జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వికెట్ కీపర్-బ్యాటర్ సంజూ శాంసన్‌ను పక్కనపెట్టి, యువ ఆటగాడు ధ్రువ్ జురెల్‌కు అవకాశం ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టాడు.ఇది సెలెక్టర్లు తీసుకున్న సరైన నిర్ణయం కాదని స్పష్టం చేశారు.

ధ్రువ్ జురెల్ అద్భుతమైన ఆటగాడని, భారత క్రికెట్ భవిష్యత్తు అతడేనని కైఫ్ ప్రశంసించారు. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో జురెల్ చేసిన సెంచరీ అతని ప్రతిభకు నిదర్శనమని అన్నారు. "జురెల్ చాలా చక్కగా ఆడాడు. అతను కచ్చితంగా భవిష్యత్ స్టార్. కానీ సంజూ శాంసన్‌ను పక్కనపెట్టడం మాత్రం తప్పుడు నిర్ణయం. ఎందుకంటే 5వ లేదా 6వ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి జురెల్ కంటే శాంసన్ చాలా ఉత్తమమైన ఆటగాడు" అని కైఫ్ తన యూట్యూబ్ ఛానల్‌లో అభిప్రాయపడ్డారు.

లోయర్ ఆర్డర్‌లో భారీ షాట్లు, ముఖ్యంగా సిక్సర్లు కొట్టగల ఆటగాడు అవసరమని, ఆ సామర్థ్యం శాంసన్‌కు పుష్కలంగా ఉందని కైఫ్ వివరించారు. "ఆ స్థానంలో స్పిన్నర్లపై సిక్సర్లు బాదగల ఆటగాడు కావాలి. ఆసియా కప్‌లో సంజూ సత్తా ఏంటో మనం చూశాం. అతడు ఆస్ట్రేలియాకు వెళ్లి ఉంటే, ఆడమ్ జంపాలాంటి స్పిన్నర్లను సులభంగా ఎదుర్కొని భారీ షాట్లు ఆడేవాడు. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్-10 ఆటగాళ్లలో సంజూ ఒకడు. ఆస్ట్రేలియా పరిస్థితులకు అతను సరిగ్గా సరిపోతాడు" అని పేర్కొన్నాడు

సెలెక్టర్లు కేవలం ఇటీవలి ఫామ్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుని, ఎప్పటినుంచో నిలకడగా రాణిస్తున్న సంజూ లాంటి ఆటగాళ్లను విస్మరించడం సరికాదని కైఫ్ హితవు పలికాడు.

కాగా, భారత జట్టులో కేఎల్ రాహుల్ ప్రధాన వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నాడు. రిషబ్ పంత్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో రెండో వికెట్ కీపర్ స్థానం కోసం పోటీ ఏర్పడింది. మిడిలార్డర్‌లో అవసరమైతే మెరుగ్గా ఆడగలడనే ఉద్దేశంతోనే సంజూ కంటే జురెల్‌కు ప్రాధాన్యం ఇచ్చినట్లు సెలెక్టర్ల చైర్మన్ అజిత్ అగార్కర్ చెప్పినట్లు తెలిసింది. ఆసియా కప్ టీ20 టోర్నీలో శాంసన్ 5వ స్థానంలో విఫలమయ్యాడని సెలెక్టర్లు భావించినట్లు సమాచారం.


More Telugu News