రేటింగ్‌ ఇస్తే డబ్బులంటూ టెక్కీకి ఎర.. రూ.55 లక్షల లూటీ!

  • ఆన్‌లైన్ రేటింగ్ టాస్క్‌ల పేరుతో భారీ మోసం
  • బాధితుడు పటాన్‌చెరుకు చెందిన హెచ్‌సీఎల్ ఉద్యోగి 
  • మొదట రూ.5 వేలు ఇచ్చి నమ్మించిన సైబర్ నేరగాళ్లు
  • విడతలవారీగా రూ.54 లక్షలకు పైగా వసూలు
  • డబ్బు విత్‌డ్రాకు మళ్లీ డబ్బు అడగడంతో మోసం గుర్తింపు
  • సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితుడి ఫిర్యాదు
సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో ఓ ఉన్నత విద్యావంతుడైన ఐటీ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయాడు. ఆన్‌లైన్‌లో బ్రాండెడ్ వస్తువులకు రేటింగ్ ఇస్తే భారీగా కమీషన్ వస్తుందన్న మాయమాటలు నమ్మి ఏకంగా రూ.54 లక్షలకు పైగా పోగొట్టుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌ శివారు పటాన్‌చెరులో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పటాన్‌చెరులో నివాసముంటున్న బాధితుడు హెచ్‌సీఎల్‌లో పనిచేస్తున్నాడు. సెప్టెంబర్ 19న అతడి వాట్సాప్‌కు గుర్తుతెలియని నంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. తాము పంపే లింక్‌లోని వస్తువులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ సంపాదించుకోవచ్చని ఆ సందేశంలో ఉంది. దీనిని నమ్మిన ఆ టెక్కీ, మెసేజ్‌లో ఉన్న టెలిగ్రామ్ లింక్‌పై క్లిక్ చేసి గ్రూప్‌లో చేరాడు.

మొదటగా నిర్వాహకులు చెప్పిన రెండు టాస్క్‌లను పూర్తి చేయగా, వెంటనే అతడి బ్యాంకు ఖాతాలో రూ.5,000 జమ అయ్యాయి. దీంతో అతడికి నమ్మకం కుదిరింది. మరింత డబ్బు సంపాదించాలనే అత్యాశతో మరిన్ని టాస్క్‌లు చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ఈసారి టాస్క్‌లు చేయాలంటే ముందుగా డబ్బు చెల్లించి వాటిని కొనుగోలు చేయాలని సైబర్ నేరగాళ్లు సూచించారు. వారి మాటలు నమ్మిన బాధితుడు, తొలుత రూ.12,500 చెల్లించాడు. ఆ తర్వాత విడతలవారీగా టాస్క్‌ల కొనుగోలు, క్రెడిట్ స్కోర్, వీఐపీ చానల్ యాక్టివేషన్, నగదు విత్‌డ్రా ఫీజుల పేరుతో మొత్తం రూ.54,67,488 వరకు వారికి ఆన్‌లైన్‌లో బదిలీ చేశాడు.

అతడి ఆన్‌లైన్ ఖాతాలో లాభంతో కలిపి రూ.70 లక్షలు ఉన్నట్లు కనిపించడంతో, ఆ డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ డబ్బును విత్‌డ్రా చేయాలంటే మరో రూ.8 లక్షలు చెల్లించాలని సైబర్ ముఠా డిమాండ్ చేయడంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు. వెంటనే బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.  


More Telugu News