Anil Kumar Lahoti: 2027 నాటికి రూ.3 లక్షల కోట్లు దాటనున్న భారతదేశ మీడియా, వినోద రంగం విలువ

Anil Kumar Lahoti on Indian Media Entertainment Sector Growth
షార్ట్స్‌లో చూడండి
భారత మీడియా, వినోద రంగం అద్భుతమైన వృద్ధి పథంలో దూసుకెళుతోంది. కంటెంట్, సృజనాత్మకత, సాంకేతికత కలయికతో ఈ రంగం ఆర్థిక వ్యవస్థకు కీలక చోదక శక్తిగా మారుతోంది. 2024లో రూ.2.5 లక్షల కోట్ల విలువ కలిగిన ఈ రంగం, రాబోయే మూడేళ్లలో అంటే 2027 నాటికి రూ.3 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించనుందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఛైర్మన్ అనిల్ కుమార్ లహోటి అంచనా వేశారు. ఫిక్కీ ఫ్రేమ్స్ 25వ సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ రంగం భవిష్యత్తుకు సంబంధించిన కీలక అంశాలను పంచుకున్నారు.

భారత ఆర్థిక వ్యవస్థలో మీడియా, వినోద రంగం ప్రాముఖ్యతను లహోటి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గతేడాది ఈ రంగం నుంచి రూ.2.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరగా, అందులో కేవలం టెలివిజన్, ప్రసార విభాగం వాటాయే దాదాపు రూ.68,000 కోట్లుగా ఉందని ఆయన తెలిపారు. అనలాగ్ నుంచి డిజిటల్, అక్కడి నుంచి 4K ప్రసారాల వరకు ఈ రంగం సాంకేతికంగా ఎంతో పరిణితి సాధించిందని అన్నారు. 

స్మార్ట్ టీవీలు, 5G టెక్నాలజీ, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల రాకతో వినియోగదారుల సంఖ్య 60 కోట్లు దాటిందని, ఇది అసాధారణమైన మార్పు అని పేర్కొన్నారు. అయితే, ఈ డిజిటల్ విప్లవం కొనసాగుతున్నప్పటికీ, దేశంలోని 190 మిలియన్ల గృహాల్లో ఇప్పటికీ సంప్రదాయ లీనియర్ టెలివిజన్‌దే ఆధిపత్యమని ఆయన గుర్తుచేశారు.

ఈ వేగవంతమైన వృద్ధిని సమర్థవంతంగా నిర్వహించేందుకు నియంత్రణ, ఆవిష్కరణల మధ్య సమతుల్యత చాలా అవసరమని లహోటి స్పష్టం చేశారు. "ఆవిష్కరణలు, ఆరోగ్యకరమైన పోటీ ద్వారా క్రమబద్ధమైన వృద్ధిని ప్రోత్సహించడమే ట్రాయ్ విధానం. అదే సమయంలో, వినియోగదారులకు పూర్తి పారదర్శకత కల్పించడం, చిన్న సంస్థల ప్రయోజనాలను కాపాడటం కూడా మా బాధ్యత" అని ఆయన వివరించారు. 

వ్యాపార ప్రక్రియలను సులభతరం చేసేందుకు (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్), నిబంధనలను సరళీకరించేందుకు ట్రాయ్ అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కేబుల్, టీవీ ప్రసార చట్టాల్లో చేసిన సవరణలు, టెలికమ్యూనికేషన్ చట్టం, 2023 కింద ప్రతిపాదించిన కొత్త అధికారాల వ్యవస్థ ఈ దిశగా వేసిన అడుగులేనని ఆయన అన్నారు.

భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుతూ, దేశంలోని ప్రధాన నగరాల్లో డిజిటల్ రేడియో ప్రసారాలను ప్రారంభించేందుకు ట్రాయ్ చేసిన సిఫార్సులను లహోటి ప్రస్తావించారు. ఎఫ్ఎం రేడియో రంగాన్ని బలోపేతం చేసి, ఆడియో ప్రపంచంలో ఆధునికతను తీసుకురావడమే దీని లక్ష్యమని చెప్పారు. ఈ సిఫార్సుల ప్రకారం, ప్రస్తుతం ఉన్న అనలాగ్ ఎఫ్ఎం రేడియో ఛానెళ్లు అదే ఫ్రీక్వెన్సీలో డిజిటల్ ప్రసారాలను కూడా అందించవచ్చని తెలిపారు. 

దేశవ్యాప్తంగా ఒకే టెక్నాలజీ ప్రమాణాన్ని పాటించడం, 13 నగరాల్లో కొత్త ఫ్రీక్వెన్సీలను వేలం వేయడం వంటివి ఈ డిజిటల్ మార్పులో కీలక ఘట్టాలని పేర్కొన్నారు. కంటెంట్, క్రియేటివిటీ, సంస్కృతి ఆధారిత "ఆరెంజ్ ఎకానమీ"ని నిర్మించాలన్న ప్రధానమంత్రి దార్శనికతను సాకారం చేసేందుకు పరిశ్రమ వర్గాలతో కలిసి పనిచేస్తామని లహోటి పునరుద్ఘాటించారు.
Go Back to Shorts
Anil Kumar Lahoti
Indian Media
Entertainment Industry
TRAI
FICCI Frames
Digital Revolution
OTT Platforms
Telecom Regulatory Authority of India
Digital Radio
Orange Economy

More Telugu News