అలా కాకుంటే చేదు వార్తలను వినవలసి వస్తుంది: రోహిత్ శర్మ, కోహ్లీపై సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • రోహిత్ శర్మ స్థానంలో గిల్‌కు అవకాశమివ్వడం మంచి నిర్ణయమన్న గవాస్కర్
  • తగిన ప్రాక్టీస్ కోసం కోహ్లీ, రోహిత్ దేశవాళీల్లోనూ ఆడాలని సూచన
  • రాబోయే రెండేళ్లకు వారు ఎలా సిద్ధంగా ఉంటారో చెప్పలేకపోతే చేదు వార్తలను వినాల్సి వస్తుందన్న గవాస్కర్
భారత వన్డే జట్టుకు సారథిగా రోహిత్ శర్మ స్థానంలో శుభ్‌మన్ గిల్‌కు అవకాశమివ్వడం మంచి నిర్ణయమని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియాతో త్వరలో ప్రారంభం కానున్న సిరీస్‌‍కు గిల్ సారథిగా జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఇటీవల ప్రకటించింది.

బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయంపై గవాస్కర్ స్పందిస్తూ, ఈ నిర్ణయం రాబోయే కాలంలో కొన్ని చేదు వార్తలకు ఆరంభమని అన్నారు. వన్డే వరల్డ్ కప్ 2027 కోసం రోహిత్ శర్మ సిద్ధంగా ఉంటాడని తాను అనుకోవడం లేదని గవాస్కర్ అన్నారు. ఇంటర్నేషనల్ క్యాలెండర్‌లో మన జట్టుకు రాబోయే రెండేళ్లలో ఎక్కువ వన్డేలు లేవని పేర్కొన్నారు.

సంవత్సరానికి ఆరేడు మ్యాచ్ లు మాత్రమే ఆడితే సరైన ప్రాక్టీస్ ఉండదని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రపంచ కప్ కోసం ఈ ప్రాక్టీస్ సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే శుభ్‌మన్ గిల్‌ను సిద్ధం చేసేందుకు బీసీసీఐ ఈ కెప్టెన్సీ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని అన్నారు.

కేవలం అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆడితే రోహిత్ శర్మ, కోహ్లీలకు అవసరమైన ప్రాక్టీస్ దొరకదని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రెండేళ్ళకు వారు ఎలా సిద్ధంగా ఉంటారో చెప్పలేకపోతే అభిమానులు చేదు వార్తలను వినాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. 2027 వన్డే ప్రపంచ కప్‌కు బరిలోకి దిగుతామని బలంగా చెప్పాలనుకుంటే వారు దేశవాళీ మ్యాచ్‌లలో కూడా ఆడాలని సూచించారు.


More Telugu News