హైదరాబాద్‌లో ఇల్లు కొనడం మరింత ప్రియం.. ఆకాశాన్నంటిన ధరలు

హైదరాబాద్‌లో సొంత ఇల్లు కొనుక్కోవాలనే సామాన్యుడి కల మరింత భారంగా మారింది. వేగంగా విస్తరిస్తున్న నగరంలో ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా విడుదలైన ఒక నివేదిక ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరంలోని జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో నగరంలో ఇళ్ల ధరలు సగటున 8 శాతం పెరిగాయి.

ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ ఈ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం, గత ఆర్థిక సంవత్సరం (2024-25) జులై-సెప్టెంబర్ కాలంలో హైదరాబాద్‌లో చదరపు అడుగు సగటు ధర రూ. 7,150గా ఉండగా, ఈ ఏడాది అదే సమయానికి అది రూ. 7,750కి చేరింది. నగరం ఔటర్ రింగ్ రోడ్ దాటి విస్తరిస్తుండటంతో అపార్ట్‌మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడిందని, ఇదే ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నివేదిక పేర్కొంది.

దేశంలోని 7 ప్రధాన నగరాల్లోనూ ఇదే తరహాలో ధరలు పెరిగాయని అనరాక్ తెలిపింది. ఈ ఏడు నగరాల్లో కలిపి సగటున ధరలు 9 శాతం పెరిగాయి. గతేడాది చదరపు అడుగు సగటు ధర రూ. 8,390 ఉండగా, ఇప్పుడు అది రూ. 9,105కి ఎగబాకింది. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరగడంతో అక్కడ అత్యధికంగా 24 శాతం ధరలు పెరిగాయి. అక్కడ చదరపు అడుగు ధర రూ. 7,200 నుంచి రూ. 8,900కి చేరింది.

ఇతర ప్రధాన నగరాలైన బెంగళూరులో 10 శాతం, ముంబైలో 6 శాతం, కోల్‌కతాలో 6 శాతం, చెన్నైలో 5 శాతం, పుణెలో 4 శాతం చొప్పున ఇళ్ల ధరలు పెరిగాయని అనరాక్ నివేదిక వివరించింది. మొత్తంగా, పెరుగుతున్న గిరాకీ కారణంగా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం దూకుడుగా ఉందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.


More Telugu News