గ్రీన్ జర్నీ పేరుతో ప్రజల రక్తం పీలుస్తున్నారు.. ప్రభుత్వంపై కవిత తీవ్ర విమర్శలు

  • సీఎం రేవంత్‌రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శలు
  • రాష్ట్రంలో బస్సు చార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడి
  • గ్రీన్ జర్నీ పేరుతో ప్రభుత్వం సామాన్యులను దోచుకుంటోందని ఆరోపణ
  • బస్సు ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి కల్పిస్తున్నారని మండిపాటు
  • సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సామాన్య ప్రజలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎందుకంత కోపమని సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్‌' వేదికగా తన నిరసనను వ్యక్తం చేశారు.

"గ్రీన్ జర్నీ పేరుతో ప్రభుత్వం సామాన్యుల రక్తాన్ని పీల్చేస్తోంది. బస్సు ఎక్కడమే పాపం అన్నట్లుగా ప్రజల జేబులను గుల్ల చేస్తున్నారు" అని కవిత తన పోస్టులో తీవ్రంగా విమర్శించారు. ఇటీవలే బస్సు పాస్‌ల ధరలను పెంచి చిరుద్యోగులు, విద్యార్థులపై పెనుభారం మోపిన ప్రభుత్వం, ఇప్పుడు ఏకంగా బస్సు చార్జీలను అమాంతం పెంచేయడం దారుణమని ఆమె మండిపడ్డారు.

ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు సామాన్యుడి నడ్డి విరిచేలా ఉన్నాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా రవాణాను ప్రజలకు దూరం చేసేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని, చార్జీల పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. 

Kavitha
MLC Kavitha
Telangana Jagruthi
RTC bus charges
Revanth Reddy
Congress government
Telangana
Bus fare hike
Green journey
Public transport

More Telugu News