Amaravati: అమరావతిలో మేం భాగస్వాములమవుతాం... రూ.10,000 కోట్ల పెట్టుబడులకు మలేషియా ఆసక్తి

Amaravati to Receive 10000 Crore Investment from Malaysia
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా కంపెనీలు భారీ ఆసక్తిని ప్రదర్శించాయి. రాబోయే ఐదేళ్లలో సుమారు రూ. 6,000 కోట్ల నుంచి రూ. 10,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాయి. ప్రధానంగా విద్య, పర్యాటకం, వాణిజ్యం, రియల్ ఎస్టేట్ వంటి కీలక రంగాల్లో ఈ పెట్టుబడులు ఉండనున్నాయి.

శుక్రవారం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణతో మలేషియా ప్రతినిధుల బృందం సమావేశమైంది. ఈ బృందంలో మలేషియా సెలంగోర్ రాష్ట్ర మంత్రి పప్పరాయుడు వెరమన్, క్లాంగ్ ఎంపీ వి. గణపతిరావు, మలేషియా-ఆంధ్రా బిజినెస్ ఛాంబర్ ప్రతినిధులు, పలు ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు ఉన్నారు. అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో పర్యటిస్తున్న ఈ బృందం, మంత్రి నారాయణతో కలిసి రాజధాని ప్రాంతంలో పర్యటించి, పనుల పురోగతిని పరిశీలించింది.

అమరావతి అభివృద్ధిలో తాము భాగస్వాములం అవుతామని మంత్రి పప్పరాయుడు ఈ సందర్భంగా తెలిపారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ ప్రాజెక్టుల వివరాలను మంత్రి నారాయణకు వివరించారు. ఇందులో భాగంగా సైబర్‌జయా యూనివర్సిటీ అమరావతిలో ఒక మెడికల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి, ప్రముఖ బెర్జయ గ్రూప్ ఫైవ్ స్టార్ హోటళ్లను నిర్మించడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి. ముఖ్యంగా మలేషియాలోని తెలుగు సంతతికి చెందిన పలువురు వ్యాపారవేత్తలు ఈ ప్రాజెక్టులపై ఆసక్తి చూపడం విశేషం.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మలేషియా ప్రతినిధులకు అమరావతి నిర్మాణ పనుల గురించి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అమరావతిని ఒక ప్రణాళిక ప్రకారం నిర్మిస్తున్నామని, ప్రపంచంలోని ఐదు ఉత్తమ రాజధానుల్లో ఒకటిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాజధానిలో ఇప్పటికే రూ. 51,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించామని తెలిపారు. నిర్దేశిత గడువులోగా పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

రానున్న ఏడాదిన్నరలో 360 కిలోమీటర్ల ప్రధాన రహదారులు, రెండేళ్లలో 1,500 కిలోమీటర్ల లేఅవుట్ రోడ్లు, వచ్చే ఏడాది మార్చి నాటికి ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల కోసం 4,000 గృహాల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. గత మూడు నెలలుగా వర్షాల కారణంగా పనులకు కొంత ఆటంకం కలిగిందని, రానున్న రోజుల్లో పనులు వేగవంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబు, అదనపు కమిషనర్ భార్గవ తేజ పాల్గొన్నారు.
Go Back to Shorts
Amaravati
Andhra Pradesh
Malaysia
Investments
P Narayana
Cyberjaya University
Berjaya Group
Real Estate
Tourism
Chandrababu Naidu

More Telugu News