పెళ్లికి సిద్ధమైన ప్రేమ జంటను చిదిమేసిన విజయ్ సభ!

  • తమిళనాడు కరూర్‌లో నటుడు విజయ్ సభలో తీవ్ర విషాదం
  • తొక్కిసలాట జరిగి 40 మంది దుర్మరణం
  • మృతుల్లో వచ్చే నెల నిశ్చితార్థం చేసుకోవాల్సిన ప్రేమజంట
తమిళనాడులోని కరూర్‌లో ఆనందం కోసం వెళ్లిన ఆ జంట జీవితాల్లో తీవ్ర విషాదం నిండింది. నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ రాజకీయ సభలో జరిగిన తొక్కిసలాట, ఇద్దరు ప్రేమికులను పెళ్లి పీటలెక్కకుండానే బలితీసుకుంది. వచ్చే నెలలో నిశ్చితార్థం, జనవరిలో వివాహం చేసుకోవాలని కలలు కన్న ఆకాశ్‌ (26), గోకులశ్రీ (26) కథ విషాదాంతంగా ముగిసింది.

వివరాల్లోకి వెళితే.. ఐటీ ఉద్యోగి అయిన ఆకాశ్‌, వల్లువార్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న గోకులశ్రీ చిన్ననాటి స్నేహితులు. తమ అభిమాన నటుడు విజయ్ ను చూసేందుకు శనివారం గోకులశ్రీ అన్న ప్రభాకరన్‌తో కలిసి సభా ప్రాంగణానికి వెళ్లారు. విజయ్ రాక ఆలస్యం కావడంతో జనం భారీగా పోగయ్యారు. గంటల తరబడి ఎదురుచూపుల తర్వాత ఒక్కసారిగా జనం అదుపుతప్పడంతో తీవ్రమైన తొక్కిసలాట జరిగింది.

"మేము సభా ప్రాంగణం దగ్గర ఒక ఇంటి టెర్రస్‌పై ఉన్నాం. కిందకు దిగే ప్రయత్నంలో జనం ఒక్కసారిగా మీదపడ్డారు. నాకు ఇటీవలే యాంజియోప్లాస్టీ జరిగిందని, నన్ను పక్కకు వెళ్ళమని నా సోదరి చెప్పింది" అని ప్రభాకరన్ కన్నీటిపర్యంతమయ్యారు. ఆ మాటలు చెప్పిన కొద్ది నిమిషాల్లోనే ఆకాశ్‌, గోకులశ్రీ జనసందోహంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. "శనివారం సాయంత్రం 6 గంటలకు మా అమ్మ ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది, కానీ మేము వినలేదు" అంటూ ఆయన విలపించారు. పోస్టుమార్టం అనంతరం ఆదివారం ఉదయం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించగా, అదే రోజు అంత్యక్రియలు పూర్తిచేశారు.

ఈ ఘోర ప్రమాదంలో మొత్తం 40 మంది మృతి చెందడంతో తమిళనాడు రాష్ట్రం దిగ్భ్రాంతికి గురైంది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ వెంటనే కరూర్ చేరుకుని బాధితులను పరామర్శించారు. ఇది రాష్ట్ర చరిత్రలో విషాదకర ఘటన అని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించి, ఈ ఘటనపై రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశన్‌తో విచారణకు ఆదేశించారు.

ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి బాధితుల కుటుంబాలను పరామర్శించి, డీఎంకే ప్రభుత్వం, పోలీసుల వైఫల్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. "జనం భారీగా వస్తారని తెలిసి కూడా సరైన భద్రతా చర్యలు తీసుకోలేదు" అని ఆయన విమర్శించారు.

మరోవైపు, నటుడు విజయ్ ఈ ఘటనను "పూడ్చలేని లోటు"గా అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు తన పార్టీ తరపున రూ. 20 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ కఠిన సమయంలో కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విషాదంతో కరూర్ పట్టణం శోకసంద్రంలో మునిగిపోగా, రాజకీయ సభల్లో భద్రతా వైఫల్యాలపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


More Telugu News

Vijay Vijay meeting stampede Tamilaga Vettri Kazhagam Karur stampede Gokulasri Akash Tamil Nadu news MK Stalin Edappadi Palaniswami political meeting accident