NTR district: నూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని కోరుతూ ఆందోళనలు

Nuzvid Protests for NTR District Inclusion
  • ఏలూరు జిల్లా నుంచి తమను ఎన్టీఆర్‌లో కలపాలంటున్న నూజివీడు వాసులు
  • చంద్రబాబు హామీని గుర్తు చేస్తున్న స్థానికులు
  • ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని గన్నవరం, పెనమలూరు ప్రజల నుంచి కూడా డిమాండ్లు
జిల్లాల పునర్విభజన జరిగి ఏళ్లు గడుస్తున్నా, కొన్ని ప్రాంతాల ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాను మూడు జిల్లాలుగా విభజించిన తర్వాత తలెత్తిన సరిహద్దు సమస్యలు స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వాణిజ్య, విద్యాపరంగా ఏళ్ల తరబడి విజయవాడతో ముడిపడి ఉన్న గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల ప్రజలు, ఇప్పుడు ప్రతి ప్రభుత్వ పనికీ 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నం వెళ్లాల్సి రావడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాను ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలుగా విభజించినప్పుడు, విజయవాడ పార్లమెంట్ పరిధిని ఎన్టీఆర్ జిల్లాగా, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిని కృష్ణా జిల్లాగా ఏర్పాటు చేశారు. దీంతో విజయవాడకు అతి సమీపంలో ఉండే గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలు పరిపాలనాపరంగా కృష్ణా జిల్లా పరిధిలోకి వెళ్లాయి. దశాబ్దాలుగా రెవెన్యూ పనుల కోసం విజయవాడ సబ్-కలెక్టర్ కార్యాలయానికి వచ్చే ఈ ప్రాంత ప్రజలు, ఇప్పుడు జిల్లా కేంద్రమైన మచిలీపట్నం వెళ్లాల్సి రావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని స్థానిక ఎమ్మెల్యేలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు ఇప్పటికే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.

ఇదే తరహా సమస్యను ఏలూరు జిల్లాలో విలీనమైన నూజివీడు నియోజకవర్గ ప్రజలు కూడా ఎదుర్కొంటున్నారు. ఏలూరు జిల్లాలో తాము ఇమడలేకపోతున్నామని, తమను తిరిగి ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని కోరుతూ ఉద్యమాలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఈ మేరకు హామీ ఇచ్చారని స్థానిక న్యాయవాదులు, ప్రజలు గుర్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో కలపకపోతే తమ ప్రాంతం మరింత వెనుకబడిపోతుందని ఆందోళన చెందుతున్నారు. తమ నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఈ సమస్యలకు తోడు, ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాలను భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే అమరావతి జిల్లాలో కలిపే ప్రతిపాదన కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో, జిల్లాల సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 
NTR district
Nuzvid
Krishna district
Andhra Pradesh districts
Vijayawada
Machilipatnam
Gannavaram
Penamaluru
Eluru district
district reorganization

More Telugu News