బాలయ్య, షారుఖ్, మోహన్‌లాల్.. అందరినీ అభినందించిన రామ్ చరణ్

  • 71వ జాతీయ అవార్డుల విజేతలకు శుభాకాంక్షలు
  • ‘భగవంత్ కేసరి’ టీమ్‌ను అభినందించిన రామ్ చరణ్
  • ఉత్తమ నటుడు షారుఖ్‌కు ప్రత్యేకంగా విషెస్
  • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మోహన్‌లాల్‌కు ప్రశంసలు
71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతలపై టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రశంసల వర్షం కురిపించారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్, మాలీవుడ్ వరకు ప్రతిభను గౌరవిస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన ‘భగవంత్ కేసరి’ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ స్పందిస్తూ, "భగవంత్ కేసరి చిత్ర బృందానికి జాతీయ అవార్డు వచ్చినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి, సాహు గారపాటి, టీమ్ మొత్తానికి అభినందనలు" అని పేర్కొన్నారు.

అలాగే ‘జవాన్’ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ను కూడా చరణ్ అభినందించారు. "జాతీయ అవార్డుకు అన్ని విధాలా అర్హులైన షారుఖ్ ఖాన్ సర్‌కు అభినందనలు. సినిమా పట్ల మీ ప్రయాణం, మీ నైపుణ్యం, మీ అభిరుచి లక్షలాది మందికి స్ఫూర్తినిస్తాయి. మీరు మరెన్నో మైలురాళ్లు అందుకోవాలని కోరుకుంటున్నాను కింగ్" అని చెర్రీ రాసుకొచ్చారు.

భారతీయ సినీ పరిశ్రమకు చేసిన విశేష సేవలకు గానూ ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌పై చరణ్ ప్రశంసలు కురిపించారు. "లెజెండరీ నటులు మోహన్‌లాల్ సర్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినందుకు శుభాకాంక్షలు. భారతీయ సినిమాకు మీరు చేసిన సేవ అసమానమైనది. ఈ గుర్తింపునకు మీరు పూర్తిగా అర్హులు" అని చరణ్ తెలిపారు.


More Telugu News