Rekha Gupta: కేజ్రీవాల్ గారూ, నా రీల్స్ చూడటం ఆపి, అక్కడ దృష్టి పెట్టండి: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చురకలు

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అన్నింటిని విస్మరించి, రోజంతా తన వీడియోలు, రీల్స్ చూడటంలోనే కేజ్రీవాల్ కాలం గడుపుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. వాటిని చూడటం తగ్గించి, వరదలతో అల్లాడుతున్న పంజాబ్ ప్రజల గురించి పట్టించుకోవాలని హితవు పలికారు.

ఈవీఎంల ట్యాంపరింగ్‌కు సంబంధించి రేఖా గుప్తా మాట్లాడినట్లుగా ఉన్న 14 సెకన్ల వీడియో క్లిప్‌ను అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. "70 ఏళ్లుగా కాంగ్రెస్ ఈవీఎంలను మానిప్యులేట్ చేసినప్పుడు ఫర్వాలేదు, కానీ ఇప్పుడు మేం చేస్తే వాళ్లకు బాధగా ఉంది" అని ఆ వీడియోలో రేఖా గుప్తా అన్నట్లుగా ఉంది. అయితే, ఈ వీడియోను ఎడిట్ చేసి, వక్రీకరించారని బీజేపీ ఆరోపించింది.

ఈ వివాదంపై సోమవారం రేఖా గుప్తా తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలో ఒక బస్ డిపోకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "కేజ్రీవాల్ గారూ, దయచేసి నా వీడియోలు, ఇంటర్వ్యూలు, రీల్స్ చూడటం తగ్గించండి. రోజంతా మీరు నా రీల్స్ చూస్తూ మేడమ్ ఏం చెప్పింది, ఏం చెప్పలేదు అని పరిశీలిస్తుంటారని నేను అనుకుంటున్నాను" అని అన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రం వరదలతో తీవ్రంగా నష్టపోయిందని, కేజ్రీవాల్ అక్కడి ప్రజలను ఆదుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు. "కేజ్రీవాల్ శ్రద్ధ పెట్టాలనుకుంటే పంజాబ్ ప్రజలపై పెట్టాలి. వరద బాధితుల మధ్య ఆయన ఎప్పుడూ కనిపించరు" అని ఆమె విమర్శించారు.
Rekha Gupta
Arvind Kejriwal
Delhi CM
Punjab floods
Aam Aadmi Party
BJP
EVM tampering

More Telugu News