జుబీన్ గార్గ్‌ కడచూపు కోసం లక్షలాది మంది అభిమానులు.. స్తంభించిన గువాహటి సిటీ

  • 25 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
  • గాయకుడికి అభిమానుల కన్నీటి వీడ్కోలు
  • ప్రభుత్వ లాంఛనాలతో మంగళవారం అంత్యక్రియలు
అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ కు అభిమానులు కన్నీళ్లతో నివాళులు అర్పించారు. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించేందుకు లక్షలాదిమంది తరలివచ్చారు. గార్గ్ పార్థివ దేహాన్ని గువాహటి నుంచి ఆయన సొంతూరుకు తరలిస్తుండగా దారి పొడవునా అభిమానులు పూలవర్షం కురిపించారు. కన్నీళ్ల మధ్య ఆయనకు వీడ్కోలు చెబుతూ చేతులు జోడించి ప్రార్థించారు. గార్గ్ ను కడసారి చూసేందుకు జనం పోటెత్తడంతో గువాహటి సిటీ స్తంభించింది. సుమారు 25 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

నివాళులర్పించడానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో అంత్యక్రియల కోసం మరో రోజు పొడిగించాల్సి వచ్చింది. తుది వీడ్కోలు పలికేందుకు వచ్చిన ప్రజలను చూస్తే అభిమానుల గుండెల్లో ఆయన ఎంతటి గొప్ప స్థానం సంపాదించుకున్నారో తెలుస్తుంది. గార్గ్ పార్థివదేహాన్ని ఉంచిన పూలరథం వెంట వేలాది మంది కన్నీళ్లతో నడవడం వీడియోల్లో కనిపిస్తోంది. వృద్ధులు, మహిళలు, పిల్లలు, యువకులు, మహిళలు రోడ్డు పక్కన నిలబడి పూల వర్షం కురిపించారు, గార్గ్ ఆత్మశాంతి కోసం చేతులు జోడించి ప్రార్థన చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ఇంటర్నెట్ షేక్ అవుతోంది. గార్గ్‌పై ఇంత ప్రేమానురాగాలు ఉన్నాయా? అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కాగా, ప్రపంచ ప్రసిద్ధి పొందిన గార్గ్ కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని అస్సాం ప్రభుత్వం ప్రకటించింది. గార్గ్ మృతికి నివాళిగా రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.

Zubeen Garg
Assamese singer
Guwahati city
funeral procession
traffic jam
condolences
Assam
viral videos
fans
obituary

More Telugu News