జీఎస్టీ 2.0 వచ్చేసింది.. నవరాత్రి నుంచి తగ్గిన పన్నుల భారం.. ఇవే ఆ వస్తువులు!

  • దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 నూతన విధానం
  • వందలాది నిత్యావసరాలు, వస్తువులపై భారీగా తగ్గిన పన్ను రేట్లు
  • పాలు, పన్నీర్, చపాతీలపై పన్ను పూర్తిగా రద్దు
  • టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలపై పన్ను 28 నుంచి 18 శాతానికి తగ్గింపు
  • చిన్న కార్లు, బైకులు, హోటల్ గదులు, విమాన ప్రయాణాలు కూడా చౌక
  • ఆర్థిక వ్యవస్థకు రూ. 2 లక్షల కోట్ల మేలు జరుగుతుందని కేంద్రం అంచనా
దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పండుగ వేళ శుభవార్త అందించింది. ‘జీఎస్టీ 2.0’ పేరుతో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో కీలకమైన మార్పులను నేటి నుంచి అమల్లోకి తెచ్చింది. నవరాత్రి తొలి రోజైన సోమవారం నుంచి ప్రారంభమైన ఈ కొత్త విధానం వల్ల నిత్యావసరాల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు వందలాది ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ఈ మార్పులతో ప్రతి కుటుంబంపై ఆర్థిక భారం తగ్గనుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వారికి మేలు చేయనుంది. ఈ పన్ను రేట్ల హేతుబద్ధీకరణ వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ. 2 లక్షల కోట్ల అదనపు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

ఏయే వస్తువులపై పన్ను తగ్గిందంటే?
ఈ కొత్త విధానంలో సామాన్యులు రోజూ వినియోగించే వస్తువులకు పెద్దపీట వేశారు. ముఖ్యంగా ఆహార పదార్థాలపై పన్ను భారం తగ్గించారు.

పన్నే లేని వ‌స్తువులు: ప్యాక్ చేసిన పాలు, పన్నీర్, చపాతీలు, పిజ్జా బ్రెడ్ వంటి వాటిపై పన్నును పూర్తిగా రద్దు చేశారు.
నిత్యావసరాలు:  గతంలో 18% పన్ను శ్లాబులో ఉన్న వెన్న, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, కాఫీ, ఐస్ క్రీమ్, జామ్‌లు, కెచప్‌లు, బిస్కెట్ల వంటి అనేక వస్తువులను 5% శ్లాబులోకి తీసుకొచ్చారు.
ఎలక్ట్రానిక్స్: పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఏసీల వంటి గృహోపకరణాలపై పన్నును 28% నుంచి 18% శాతానికి తగ్గించారు.
వాహనాలు: చిన్న కార్లు (1200సీసీ లోపు), 350సీసీ లోపు మోటార్‌ సైకిళ్లపై పన్ను 18%గా ఉంటుంది. పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలపై కేవలం 5% పన్ను మాత్రమే విధించనున్నారు.
ఆరోగ్యం, విద్య: ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై పన్నును పూర్తిగా తొలగించారు. అత్యవసర మందులు, వైద్య పరికరాలపై 5% పన్ను వర్తిస్తుంది. పెన్సిళ్లు, పుస్తకాలు, మ్యాప్‌ల వంటి స్టేషనరీ వస్తువులపై పన్ను రద్దు చేశారు.
ఇతర సేవలు, వస్తువులు: నిర్మాణ రంగానికి ఊతమిస్తూ సిమెంట్ మీద పన్నును 28% నుంచి 18 శాతానికి తగ్గించారు. రూ. 7,500 లోపు హోటల్ గదులు, ఎకానమీ విమాన టికెట్లపై 5% జీఎస్టీ ఉంటుంది. అదేవిధంగా జిమ్‌లు, స్పాలు, సెలూన్‌ల సేవలు కూడా చౌక కానున్నాయి.


More Telugu News