Skoch Awards: ఏపీకి అవార్డుల పంట.. జాతీయ స్థాయిలో పలు శాఖలకు గుర్తింపు

AP Government Honored with Skoch and Central Government Awards
షార్ట్స్‌లో చూడండి
ఏపీలోని పలు ప్రభుత్వ శాఖలు తమ అద్భుతమైన పనితీరుతో జాతీయ స్థాయిలో సత్తా చాటాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలకు గుర్తింపుగా ప్రతిష్ఠాత్మక స్కోచ్ పురస్కారాలతో పాటు కేంద్ర ప్రభుత్వ అవార్డులు కూడా లభించాయి. బీసీ సంక్షేమం, ఆర్టీసీ, పట్టణ పేదరిక నిర్మూలన, పట్టు పరిశ్రమ వంటి కీలక శాఖలు ఈ గౌరవాన్ని అందుకున్నాయి.

బీసీ సంక్షేమ శాఖకు స్వర్ణ పతకం
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందిస్తున్నందుకు గాను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖకు 'సోషల్ జస్టిస్ సెక్యూరిటీ' విభాగంలో స్కోచ్ గోల్డ్ అవార్డు వరించింది. ఢిల్లీలో శనివారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఎస్. సవిత, స్కోచ్ గ్రూప్ ఛైర్మన్ సమీర్ కొచ్చర్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా 1,674 మందికి, ఆన్‌లైన్ ద్వారా మరో 4,774 మందికి శిక్షణ ఇవ్వగా, వారిలో 246 మంది మెగా డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారని వివరించారు. భవిష్యత్తులో అన్ని పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తామని, అమరావతిలో ఐదెకరాల్లో, అలాగే విశాఖ, రాజమండ్రి, తిరుపతి, అనంతపురంలో మెగా బీసీ స్టడీ సర్కిళ్లు నిర్మించే ఆలోచన ఉందని ఆమె ప్రకటించారు.

ఆర్టీసీ, మెప్మా, పట్టు పరిశ్రమకు పురస్కారాలు
మరోవైపు, ప్రయాణికులకు డిజిటల్ టికెటింగ్ విధానాన్ని విజయవంతంగా అమలు చేసినందుకు ఏపీఎస్ఆర్టీసీకి కూడా స్కోచ్ అవార్డు లభించింది. సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు తరపున చీఫ్ ఇంజనీర్ (ఐటీ) వై. శ్రీనివాసరావు ఈ అవార్డును స్వీకరించారు. అదేవిధంగా, పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకు విశిష్ట సేవలు అందిస్తున్నందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)కు స్కోచ్ ప్లాటినం అవార్డు దక్కింది. మెప్మా చేపట్టిన కార్యక్రమాలకు గుర్తింపుగా మొత్తం 9 స్కోచ్ అవార్డులు రావడం విశేషం.

ఇక, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్ సిల్క్ బోర్డు 'మేరా రేషమ్ - మేరా అభిమాన్' కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించినందుకు రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖకు ఉత్తమ అవార్డు లభించింది. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పట్టు పురుగుల ఉత్పత్తి పెరిగిందని, కొత్త రైతులు మల్బరీ సాగుకు ముందుకు వస్తున్నారని ఆయన తెలిపారు. ఈ ఏడాది పట్టు పరిశ్రమ శాఖకు ఇది రెండో ఉత్తమ అవార్డు.
Go Back to Shorts
Skoch Awards
Chandrababu
AP government awards
Andhra Pradesh awards
AP BC welfare
APSRTC
MEPMA
Sericulture AP
Digital ticketing
Mera Resham Mera Abhiman

More Telugu News