అమెరికాతో వాణిజ్య ఒప్పందం.. చర్చల కోసం ఈ నెల 22న అమెరికాకు పీయూష్ గోయల్!

భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు తిరిగి ఊపందుకున్నాయి. ఈ ఒప్పందాన్ని వీలైనంత త్వరగా ఖరారు చేసే లక్ష్యంతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం అమెరికాలో పర్యటించనుంది. ఈ నెల 22న ఈ బృందం అమెరికాకు బయలుదేరి వెళ్లనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఇటీవల అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయానికి చెందిన అధికారులు భారతదేశానికి వచ్చి చర్చలు జరిపిన నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. సెప్టెంబర్ 16న అమెరికా చీఫ్ నెగోషియేటర్ బ్రెండన్ లించ్ నేతృత్వంలోని బృందం ఢిల్లీలో పర్యటించింది. భారత వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని అధికారులతో వారు సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒప్పందాన్ని త్వరితగతిన ముగించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేయాలని ఇరుపక్షాలు నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఢిల్లీలో జరిగిన చర్చల కొనసాగింపుగానే ఇప్పుడు పీయూష్ గోయల్ బృందం అమెరికాకు వెళుతోందని, ఇరు దేశాలకు ప్రయోజనకరమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని కేంద్రం స్పష్టం చేసింది. వాణిజ్యపరమైన అంశాలపై ఇరు దేశాల వైఖరి సానుకూలంగా ఉందని, ఇది త్వరలోనే మంచి ఫలితాలను ఇస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Piyush Goyal
India US trade deal
India America trade
Brendan Lynch
Rajesh Agarwal
US trade representative

More Telugu News