ఢిల్లీ ఆకాశంలో అగ్నిగోళం... వైరల్ అవుతున్న వింత కాంతులు

  • తెల్లవారుజామున కనిపించిన వింత కాంతులు
  • వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన స్థానికులు
  • ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లోనూ కనిపించిన దృశ్యం
  • భూ వాతావరణంలోకి ప్రవేశించిన ఉల్కగా అనుమానం
  • దీన్ని 'బోలైడ్' అంటారని చెబుతున్న శాస్త్రవేత్తలు
దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల ప్రజలను శనివారం తెల్లవారుజామున ఆకాశంలోని ఓ దృశ్యం అబ్బురపరిచింది. నగరంలోని వీధి దీపాల కాంతిని మించిపోయేలా ఓ అగ్నిగోళం లాంటి వస్తువు మెరుపులు చిమ్ముతూ కొన్ని క్షణాల పాటు కనిపించి మాయమైంది. ఈ అనూహ్య పరిణామంతో చాలా మంది ఆశ్చర్యపోయారు.

ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన కొందరు వెంటనే తమ ఫోన్లలో వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. తమ జీవితంలో ఇలాంటిదాన్ని ఎప్పుడూ చూడలేదని, ఇది ఓ అద్భుతమైన అనుభవమని పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో కూడా ఈ కాంతి పుంజం కనిపించినట్లు సమాచారం.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నమైన చర్చ మొదలైంది. కొందరు దీనిని ప్రకృతి అద్భుతంగా అభివర్ణించగా, మరికొందరు ఇంత తక్కువ సమయంలో అంతమంది ఎలా వీడియోలు తీయగలిగారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

ఉల్కాపాతమేనంటున్న నిపుణులు

ఈ వింత వెలుగులపై ఖగోళ శాస్త్రవేత్తలు స్పందించారు. ఇది 'బోలైడ్' అనే ఉల్క అయివుండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. భూ వాతావరణంలోకి అత్యంత వేగంగా ప్రవేశించినప్పుడు ఘర్షణ కారణంగా ఉల్కలు మండిపోయి ముక్కలై ఇలాంటి కాంతిని వెదజల్లుతాయని వారు వివరించారు. అమెరికన్ మెటియర్ సొసైటీ ప్రకారం, సెప్టెంబర్ నెలలో అప్పుడప్పుడు ఇలాంటి ఉల్కాపాతాలు కనిపించడం సాధారణమేనని తెలిపారు. ఇలాంటి ఖగోళ సంఘటనలు అరుదు కాకపోయినా, నగర ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించడం ప్రజల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.


More Telugu News