బీసీసీఐ అధ్యక్ష పీఠం.. గంగూలీ, హర్భజన్‌తో పాటు రేసులో ఉన్నది వీరే!

  • వేడెక్కిన బీసీసీఐ అధ్యక్ష పదవి ఎన్నికల రాజకీయం
  • రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న గంగూలీ, హర్భజన్ సింగ్ పేర్లు
  • నేటి నుంచే ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియ
  • పోటీలో కర్ణాటక, సౌరాష్ట్రల నుంచి మరో ఇద్దరు మాజీ క్రికెటర్లు
  • మరోవైపు తెరపైకి మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే పేరు
  • ఈ నెల 28న ముంబైలో ఏజీఎం, అధ్యక్షుడి ఎన్నిక
ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ అధ్యక్ష పదవికి ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 28న ముంబైలో జరగనున్న బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) నేపథ్యంలో అధ్యక్ష పదవికి పోటీ తీవ్రంగా మారింది. ఈసారి పలువురు మాజీ స్టార్ క్రికెటర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండటంతో ఈ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచే ప్రారంభం కానుంది.

ఎన్నికల అధికారి ఏ.కె. జోటి సెప్టెంబర్ 19న విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా ప్రకారం, నలుగురు మాజీ క్రికెటర్లు అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు అర్హత సాధించారు. వారిలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి సౌరవ్ గంగూలీ, పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ తరఫున స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఉన్నారు. వీరితో పాటు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం నుంచి రఘురామ్ భట్, సౌరాష్ట్ర క్రికెట్ సంఘం నుంచి జయదేవ్ షా కూడా బరిలో నిలిచారు. దీంతో ఈసారి కూడా ఓ క్రికెటరే బోర్డు పగ్గాలు చేపట్టాలనే వాదనకు బలం చేకూరినట్లయింది.

ఈ క్రమంలోనే భారత మాజీ వికెట్ కీపర్, బరోడా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కిరణ్ మోరే పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఓటర్ల జాబితాలో రాష్ట్ర ప్రతినిధిగా ఆయన పేరు లేనప్పటికీ, ప్రత్యేక నిబంధనల ప్రకారం ఆయన నామినేషన్ వేసే అవకాశం ఉందని సమాచారం. గతంలో జాతీయ సెలెక్టర్‌గా పనిచేసిన అనుభవంతో పాటు, ముంబై ఇండియన్స్ జట్టుతో, ప్రస్తుతం డబ్ల్యూపీఎల్‌లో ఆ జట్టు మహిళల విభాగానికి జనరల్ మేనేజర్‌గా కూడా మోరే సేవలు అందిస్తున్నారు.

మరోవైపు, అధ్యక్ష పదవి రేసులో సచిన్ టెండూల్కర్ పేరు కూడా వినిపించినప్పటికీ, తనకు ఆసక్తి లేదని చెబుతూ ఆయన తిరస్కరించారు. ఈ ఎన్నికపై చర్చించేందుకు శనివారం ఢిల్లీలో ఒక అనధికారిక సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు నుంచి నామినేషన్లు స్వీకరించి, 23న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. సెప్టెంబర్ 28న జరిగే ఏజీఎంలో ఓటింగ్ నిర్వహించి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఇదే సమావేశంలో కొత్త జాతీయ సెలక్టర్ల కమిటీని కూడా ఖరారు చేయనున్నారు.


More Telugu News