కన్నీళ్లను దిగమింగుకుని... తిరిగి మైదానంలోకి శ్రీలంక ఆల్ రౌండర్ వెల్లలాగే

  • గుండెపోటుతో కన్నుమూసిన దునిత్ వెల్లలాగే తండ్రి 
  •  ఆసియా కప్ నుంచి స్వదేశానికి వెళ్లిన క్రికెటర్
  •  అంత్యక్రియలు ముగించుకుని మళ్లీ జట్టుతో చేరేందుకు పయనం
  • బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం
  • వెల్లలాగేకు తండ్రిలా అండగా ఉంటానన్న కోచ్ సనత్ జయసూర్య
  • సోషల్ మీడియాలో జయసూర్య భావోద్వేగ పోస్ట్
గుండెపోటుతో మరణించిన తండ్రి సురంగ వెల్లలాగే అంత్యక్రియలు ముగించుకుని శ్రీలంక యువ ఆల్‌రౌండర్ దునిత్ వెల్లలాగే తిరిగి జట్టులో చేరేందుకు సిద్ధమయ్యాడు. ఆసియా కప్‌లో భాగంగా గురువారం అబుదాబిలో ఆఫ్ఘనిస్థాన్-శ్రీలంక మ్యాచ్ జరుగుతుండగా వెల్లలాగే తండ్రి మరణవార్త జట్టుకు అందింది. మ్యాచ్ ముగిసిన తర్వాత  కోచ్ సనత్ జయసూర్య, టీమ్ మేనేజర్ కలిసి వెల్లలాగేకు అతడి తండ్రి మరణవార్తను తెలిపారు. విషయం తెలిసిన వెంటనే అతడు స్వదేశానికి పయనమయ్యాడు. తండ్రి అంత్యక్రియల అనంతరం గత రాత్రి యూఏఈకి చేరుకున్న వెల్లలాగే, నేడు బంగ్లాదేశ్‌తో జరగనున్న సూపర్ ఫోర్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని బోర్డు తెలిపింది.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో వెల్లలాగేకు అండగా నిలుస్తూ హెడ్ కోచ్ సనత్ జయసూర్య సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. "సురంగ వెల్లలాగే మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. దేశం గర్వపడే కొడుకును పెంచిన గొప్ప తండ్రి ఆయన. దునిత్, నీ తండ్రి కూడా ఒక క్రికెటర్. ఆయన ఆశయాలు, క్రీడపై ఆయనకున్న ప్రేమ నీలో ఎప్పటికీ జీవించే ఉంటాయి. ఈ కష్టకాలంలో నువ్వు ఒంటరివి కాదు, నేను నీకు తండ్రిలా అండగా ఉంటాను. జట్టు, దేశం మొత్తం నీ వెంటే ఉంది" అని జయసూర్య భరోసా ఇచ్చాడు.

22 ఏళ్ల వెల్లలాగే ఇప్పటివరకు శ్రీలంక తరఫున ఒక టెస్ట్, 31 వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ముఖ్యంగా గతంలో భారత్‌పై రెండుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో శ్రీలంక జట్టు అద్భుత ఫామ్‌లో ఉంది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.


More Telugu News