భారత్‌లో ఐఫోన్ 17 అమ్మకాల ప్రారంభం... స్టోర్ల‌కు ఎగబడ్డ జనం.. భారీ క్యూ లైన్లు

  • భారత్‌లో ఐఫోన్ 17, 17 ప్రో, ఐఫోన్ ఎయిర్ అమ్మకాలు మొదలు
  • ముంబై యాపిల్ స్టోర్ వద్ద తీవ్ర తోపులాట, గందరగోళ వాతావరణం
  • ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఆరెంజ్ కలర్ వేరియంట్‌కు భారీ డిమాండ్
  • ఢిల్లీ, బెంగళూరు స్టోర్ల వద్ద కూడా ఉదయం నుంచే భారీ క్యూ లైన్లు
  • కొత్త ఫీచర్లు, పెరిగిన ధరలతో మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 17 సిరీస్
యాపిల్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 17 సిరీస్ అమ్మకాలు భారతదేశంలో ప్రారంభమయ్యాయి. కొత్త ఫోన్‌ను అందరికంటే ముందు సొంతం చేసుకునేందుకు జనం భారీగా ఎగబడటంతో ముంబైలోని బీకేసీ యాపిల్ స్టోర్ వద్ద తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి జ‌నాల‌ను చెదరగొట్టాల్సి వచ్చింది. ఈ ఘటనకు కారణమైన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

శుక్రవారం ఉదయం 8 గంటలకు దేశవ్యాప్తంగా యాపిల్ స్టోర్లలో ఐఫోన్ 17 అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లోని స్టోర్ల వద్ద గురువారం రాత్రి నుంచే వందలాది మంది క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ముఖ్యంగా ఈసారి కొత్తగా విడుదలైన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఆరెంజ్ కలర్ వేరియంట్‌కు విపరీతమైన క్రేజ్ కనిపించింది. చాలా మంది ఈ ప్రత్యేకమైన రంగు కోసమే గంటల తరబడి నిరీక్షించారు.

"నేను నిన్న రాత్రి 8 గంటల నుంచే ఈ ఆరెంజ్ కలర్ ప్రో మ్యాక్స్ మోడల్ కోసం ఎదురుచూస్తున్నాను. దీని డిజైన్, కెమెరా అప్‌గ్రేడ్స్ అద్భుతంగా ఉన్నాయి" అని ముంబైకి చెందిన ఇర్ఫాన్ అనే కొనుగోలుదారుడు తెలిపాడు. మరో కస్టమర్ అమాన్ మీనన్ మాట్లాడుతూ, "గత ఆరు నెలలుగా ఈ ఆరెంజ్ కలర్ మోడల్ వస్తుందని వార్తలు వింటున్నాను. అప్పటి నుంచి దీని కోసమే వెయిట్ చేస్తున్నాను" అని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 

ఈసారి యాపిల్, ఐఫోన్ 17 బేస్ మోడల్‌లో కూడా కీలకమైన మార్పులు చేసింది. ప్రీమియం మోడళ్లలో ఉండే 120Hz ప్రోమోషన్ డిస్‌ప్లేను ఇప్పుడు బేస్ వేరియంట్‌లోనూ అందించింది. ప్రారంభ స్టోరేజ్‌ను 256GBకి పెంచింది. గతేడాదితో పోలిస్తే బేస్ మోడల్ ధరను కేవలం రూ. 3,000 పెంచగా, 17 ప్రో మోడల్ ధరను మాత్రం రూ. 15,000 అధికం చేసింది. ఏదేమైనా యాపిల్ ఉత్పత్తులపై భారతీయులలో ఉన్న ఆసక్తి ఏమాత్రం తగ్గలేదని ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి.


More Telugu News