కుటుంబంలో గొడవలపై మంచు లక్ష్మి ఏమన్నారంటే..!

  • తలా, తోక కట్‌ చేసి నచ్చినట్లు రాసుకునే రోజులివి
  • మౌనంగా ఉండడమే మేలనిపించిందన్న నటి
  • మిరాయ్‌ విజయాన్ని తాను కూడా ఎంజాయ్‌ చేస్తున్నానని వెల్లడి
మంచు కుటుంబంలో నెలకొన్న విభేదాలపై మంచు లక్ష్మి తాజాగా స్పందించారు. ఈ నెల 19 న తన చిత్రం ‘దక్ష’ విడుదల కానున్న సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ప్రతీ కుటుంబంలోనూ సమస్యలు సహజమని అన్నారు. కుటుంబంలో ఓ సమస్య ఎదురైనప్పుడు ఆ ఫ్యామిలీలో అందరూ బాధపడతారని చెప్పారు. 

అయితే, తాము అద్దాల మేడలో ఉంటున్నామని, ఏది మాట్లాడినా దానిని వక్రీకరించి తమకు నచ్చిన విధంగా రాసుకునే రోజుల్లో ఉన్నామని ఆమె వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా మాట్లాడటం కంటే మౌనంగా ఉండటమే ఉత్తమమని తాను భావించినట్లు ఆమె తెలిపారు. అందుకే తమ కుటుంబ వ్యవహారాలపై మౌనం పాటించినట్లు మంచు లక్ష్మి స్పష్టం చేశారు.

తమ కుటుంబంలో ఎవరు హిట్‌ అందుకున్నా తాను ఆనందిస్తానని, మనోజ్ సినిమా మిరాయ్ విజయాన్ని తాను కూడా ఎంజాయ్ చేస్తున్నానని మంచు లక్ష్మి పేర్కొన్నారు. ఒకరి కష్టం వృథా కావాలని తాను ఎన్నడూ కోరుకోనని చెప్పారు. సినిమా రంగంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఒక ఆర్టిస్ట్ గా తనకు తెలుసన్నారు. ఒక ఆర్టిస్ట్‌గా తన కుటుంబ సభ్యులకు సలహాలు ఇస్తానని చెప్పారు. గతంలో ఏది ఒప్పు, ఏది తప్పు అని ఆలోచించేదాన్నని, ఇప్పుడు మాత్రం దీని వల్ల నేను ఆనందంగా ఉంటానా, బాధపడతానా అని ఆలోచిస్తున్నానని మంచు లక్ష్మి వివరించారు.


More Telugu News