India vs Pakistan: ఆసియా కప్‌లో మళ్లీ దాయాదుల పోరు.. ఎప్పుడంటే..!

India vs Pakistan Asia Cup Super 4 Match on September 21
  • ఆసియా కప్ 2025 సూపర్ 4 దశకు అర్హత సాధించిన పాకిస్థాన్
  • యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో ఘన విజయం
  • సూపర్ 4లో భాగంగా టీమిండియాతో మరోసారి తలపడనున్న దాయాది
  • ఆదివారం దుబాయ్ వేదికగా ఈ హై-వోల్టేజ్ మ్యాచ్
  • ఇప్పటికే గ్రూప్-ఏ నుంచి సూపర్ 4 చేరిన భారత్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఆసియా కప్ 2025లో మరోసారి రంగం సిద్ధమైంది. సూపర్ 4 దశలో భాగంగా ఈ దాయాది జట్లు ఈ నెల‌ 21న (ఆదివారం) దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. యూఏఈతో బుధవారం జరిగిన కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘన విజయం సాధించడంతో ఈ ఆసక్తికర పోరు ఖరారైంది.

సూపర్ 4కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 41 పరుగుల తేడాతో యూఏఈని ఓడించింది. ఈ విజయంతో గ్రూప్-ఏ నుంచి భారత్ తర్వాత సూపర్ 4 దశకు అర్హత సాధించిన రెండో జట్టుగా నిలిచింది. ఇప్పటికే పాకిస్థాన్, యూఏఈలపై విజయాలు సాధించి టీమిండియా సూపర్ 4 బెర్తును ఖాయం చేసుకున్న విషయం తెలిసిందే.

యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ కాస్త తడబడింది. అయితే, చివర్లో పేసర్ షాహీన్ అఫ్రిది మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో మెరుగైన స్కోరు సాధించగలిగింది. అనంతరం లక్ష్య ఛేదనలో యూఏఈ గట్టిగానే పోరాడినా, కీలక దశలో చేతులెత్తేసింది. కేవలం 20 పరుగుల వ్యవధిలోనే చివరి 7 వికెట్లను కోల్పోయి 105 పరుగులకు ఆలౌట్ అయింది.

కాగా, మ్యాచ్ రిఫరీపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చేసిన ఫిర్యాదుకు సంబంధించిన వివాదంతో ఈ మ్యాచ్ గంటకు పైగా ఆలస్యంగా మొదలైంది. ఈ తాజా ఫలితంతో గ్రూప్-ఏలో భారత్ అగ్రస్థానంలో, పాకిస్థాన్ రెండో స్థానంలో నిలవడం దాదాపు ఖాయమైంది. దీంతో ఆదివారం జరగనున్న సూపర్ 4 పోరులో ఈ రెండు చిరకాల ప్రత్యర్థులు మరోసారి అమీతుమీ తేల్చుకోనున్నారు.
India vs Pakistan
India Pakistan match
Asia Cup 2025
Pakistan cricket
Shaheen Afridi
Dubai
Super 4
UAE
PCB
cricket

More Telugu News