Prakasham district: ప్రకాశం జిల్లాలో భార్యపై దాడి వీడియో వైరల్.. శాడిస్టు భర్త కోసం పోలీసుల వేట

Wife Assault Video Viral Prakasham District Police Hunt for Sadist Husband
షార్ట్స్‌లో చూడండి
ప్రకాశం జిల్లాలో అత్యంత అమానుష ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను పందిరికి కట్టేసి ఓ భర్త కిరాతకంగా హింసించాడు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని 24 గంటల్లో అరెస్ట్ చేస్తామని మార్కాపురం సర్కిల్ ఇన్స్‌పెక్టర్ (సీఐ) వెంకటేశ్వరరావు బుధవారం స్పష్టం చేశారు.

వివరాల్లోకి వెళితే, తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు గ్రామంలో ఓ వ్యక్తి తన భార్యపై దాడి చేసి, ఆమెను పందిరికి కట్టి చిత్రహింసలకు గురిచేశాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపించడంతో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ తీవ్రంగా స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకుని బాధితురాలిని రక్షించి, వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామని సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నేరంలో అతడికి సహకరించిన మరికొందరిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఆయన వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి పైశాచిక ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

స్పందించిన మహిళా కమిషన్

ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి, తక్షణమే విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మహిళలపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి దురాగతాలను ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి నిందితుడిని త్వరగా అరెస్ట్ చేయాలని కోరారు.
Go Back to Shorts
Prakasham district
Wife assault
Domestic violence
Andhra Pradesh
Rayapati Shailaja
Women Commission
Police investigation
Viral video
Crime news

More Telugu News