KTR: సాయుధ పోరాట స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొందాం: కేటీఆర్ పిలుపు

KTR calls to confront Congress government with armed struggle spirit
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణులతో వ్యవహరిస్తోందని, ఈ పోకడలను తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఎదుర్కోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

తెలంగాణ అంటేనే త్యాగాలకు, పోరాటాలకు చిరునామా అని కేటీఆర్ అన్నారు. రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఆనాడు లక్షలాది మంది పోరాడితే, వేలాది మంది ప్రాణ త్యాగాలు చేశారని గుర్తుచేశారు. ఆ అమరవీరుల స్ఫూర్తితోనే నేటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. దొడ్డి కొమురయ్య, షేక్ బందగీ, రావి నారాయణరెడ్డి వంటి ఎందరో మహానుభావుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి వినమ్రంగా నివాళులర్పించారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. గ్రూప్-1 పోస్టుల భర్తీ విషయంలో విఫలమై, నిరసన తెలుపుతున్న విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేయించడం దుర్మార్గమని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వారిని పట్టించుకోకుండా, ప్రభుత్వం ఒలింపిక్స్ వంటి ఇతర అంశాలపై దృష్టి సారిస్తోందని ఎద్దేవా చేశారు.

ఇలాంటి నియంతృత్వ పోకడలను ఎదుర్కొని, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో మళ్లీ సంక్షేమ, రైతు రాజ్యం తీసుకురావడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17ను కొందరు విమోచనం, మరికొందరు విలీనం అంటున్నారని, కానీ రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యంలోకి సమైక్యమైన రోజు కాబట్టే తాము ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’గా పాటిస్తున్నామని ఆయన వివరించారు.

Go Back to Shorts
KTR
KTR BRS
Telangana Congress
Telangana Armed Struggle
National Integration Day
Telangana Politics
KCR
Revanth Reddy Government
Farmers issues Telangana
Group 1 exams

More Telugu News