బేస్‌బాల్ బ్యాట్‌తో మహిళా పోలీసును కొట్టి చంపిన భర్త

  • మధ్యప్రదేశ్‌లో మహిళా హెడ్ కానిస్టేబుల్ దారుణ హత్య
  • సిధి జిల్లా పోలీస్ క్వార్టర్స్‌లోనే ఘోరం
  • వంట చేస్తున్న సమయంలో దాడికి పాల్పడిన నిందితుడు
కట్టుకున్న భర్తే కాలయముడై ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు తీశాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో జరిగింది. పోలీస్ క్వార్టర్స్‌లోనే ఈ హత్య జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.  సిధి జిల్లాలోని ప్రభుత్వ పోలీస్ క్వార్టర్స్‌లో సవితా సాకేత్ (హెడ్ కానిస్టేబుల్), ఆమె భర్త వీరేంద్ర సాకేత్ నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆదివారం రాత్రి సవిత వంటగదిలో భోజనం సిద్ధం చేస్తుండగా భార్యాభర్తల మధ్య ఏదో విషయంలో తీవ్ర వాగ్వివాదం జరిగింది.

ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన భర్త వీరేంద్ర, పక్కనే ఉన్న బేస్‌బాల్ బ్యాట్ తీసుకుని సవితపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తలకు బలమైన గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. అసలు దంపతుల మధ్య గొడవకు దారితీసిన కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.  


More Telugu News