ఉత్తరాఖండ్లో జల ప్రళయం.. డెహ్రాడూన్లో కొట్టుకుపోయిన ఇళ్లు, కార్లు!
- డెహ్రాడూన్ శివార్లలో భారీ మేఘవిస్ఫోటనం, కుండపోత వర్షం
- సహస్రధార ప్రాంతంలో కొట్టుకుపోయిన ఇళ్లు, దుకాణాలు, వాహనాలు
- ప్రఖ్యాత టపకేశ్వర్ మహాదేవ్ ఆలయంలోకి చేరిన వరద నీరు
సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల డెహ్రాడూన్లోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన టపకేశ్వర్ మహాదేవ్ ఆలయం జలమయమైంది. తమ్సా నది ఉప్పొంగడంతో వరద నీరు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి, ఆవరణలోని హనుమాన్ విగ్రహం వరకు చేరింది. అయితే, గర్భగుడికి మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆలయ వర్గాలు తెలిపాయి. మరోవైపు, రిషికేశ్లోనూ చంద్రభాగ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నదిలో చిక్కుకుపోయిన ముగ్గురు వ్యక్తులను ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా కాపాడాయి. డెహ్రాడూన్-హరిద్వార్ జాతీయ రహదారిపై ఉన్న ఒక వంతెన కూడా దెబ్బతిన్నది.
ఉత్తరాఖండ్లో వరదల పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి ఫోన్ చేసి తాజా పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ధామి స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు తక్షణమే సురక్షిత ఆవాసం, ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు.