2027 జులై నాటికి పోలవరం పూర్తి: ఏపీ ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్

  • గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం నిర్దేశించారన్న సాయి ప్రసాద్
  • నీటి సంరక్షణ చర్యలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన 
  • కేంద్ర ప్రభుత్వ నిధులతో 38,457 చిన్న నీటి పారుదల చెరువుల అభివృద్ధికి సంకల్పించామని వెల్లడి  
పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబరు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. అయితే, గోదావరి పుష్కరాలు జరిగే జులై 2027 నాటికే నీటిని అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ తెలిపారు.

కలెక్టర్ల సదస్సులో ఆయన పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టుల గురించి కూడా మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని ఆయన అన్నారు. 2027 డిసెంబరు నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, కానీ గోదావరి పుష్కరాల నాటికే ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారని ఆయన పేర్కొన్నారు. అదే దిశగా తాము జులై 2027 నాటికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని ఆయన చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ మార్పుల నేపథ్యంలో నీటి వనరుల సంరక్షణ ఒక పెద్ద సవాలుగా మారిందని, జిల్లా కలెక్టర్లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 38,457 చిన్న నీటిపారుదల చెరువులను పునరుద్ధరించాలని సంకల్పించామని ఆయన తెలిపారు.

అక్టోబరు నెలాఖరుకు పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తవుతాయని సాయిప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ.9,221 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రాధాన్యత కలిగిన నీటిపారుదల ప్రాజెక్టులు ఏడాదిలోపు పూర్తి చేయనున్నట్లు కూడా ఆయన తెలియజేశారు. 

Sai Prasad
Polavaram project
Polavaram irrigation project
Godavari Pushkaralu
Irrigation projects Andhra Pradesh
Water resources conservation
AP irrigation department
Collector conference
Small irrigation tanks restoration
Polavaram left canal

More Telugu News