తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు
- గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్స్ చెల్లించలేదని విమర్శ
- రూ. 9 వేల కోట్ల బకాయిలు ఉన్నాయన్న ఈటల రాజేందర్
- ప్రభుత్వాలు మారినప్పుడు పాత బకాయిలు చెల్లించాలన్న ఈటల
విదేశాలకు వెళ్లే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం వల్ల చాలా నష్టం జరుగుతోందని ఆయన ఆరోపించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో బీసీ విద్యార్థులకు వంద శాతం రీయింబర్సుమెంట్స్ ఇస్తామని హామీ ఇచ్చి, పాత విధానంలో కూడా రీయింబర్సుమెంట్స్ చేయలేదని విమర్శించారు. ప్రభుత్వాలు మారినప్పుడు పాత బకాయిలు కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు.
తన రాజకీయ జీవితంలో ఇంత బాధ్యతలేని ప్రభుత్వాన్ని చూడలేదని విమర్శించారు. సమస్యలు పరిష్కరించకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రానికి కావాల్సిన యూరియాను ఒక సంవత్సరం ముందు నిల్వ చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల రాష్ట్రంలో యూరియా కొరత తలెత్తిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టకుండా ఎరువులు వచ్చే మార్గంపై దృష్టి సారించాలని అన్నారు.