ఇండియా-పాక్ మ్యాచ్ వేదికగా.. బహిర్గతమైన జయం రవి ప్రేమాయణం

  • ఇండియా-పాక్ మ్యాచ్‌లో తళుక్కుమన్న జయం రవి
  • సింగర్ కెనిషాతో కలిసి దుబాయ్ స్టేడియంలో సందడి
  • భార్య ఆర్తితో విడిగా ఉంటున్నట్లు కొంతకాలంగా ప్రచారం
  • కెనిషాతో ప్రేమాయణంపై చాలాకాలంగా వదంతులు
  • త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని టాక్
ప్రముఖ తమిళ నటుడు జయం రవి తన వ్యక్తిగత జీవితం విషయంలో మరోసారి వార్తల్లో నిలిచారు. గాయని కెనిషాతో ఆయన ప్రేమలో ఉన్నారంటూ కొంతకాలంగా వస్తున్న వదంతులకు బలం చేకూర్చేలా, వీరిద్దరూ కలిసి కెమెరా కంట చిక్కారు. ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్‌లో జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు వీరిద్దరూ జంటగా హాజరయ్యారు.

జయం రవి, కెనిషా స్టేడియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇద్దరూ కలిసి మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్న చిత్రాలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి. దీంతో వీరి మధ్య ఉన్న సంబంధంపై జరుగుతున్న ప్రచారానికి ఈ ఫొటోలు మరింత ఆజ్యం పోశాయి.

గత కొంతకాలంగా జయం రవి తన భార్య ఆర్తికి దూరంగా ఉంటున్నారని, వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయని కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో సింగర్ కెనిషాతో ఆయన సన్నిహితంగా ఉంటున్నారని, త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఈ వార్తలపై అటు జయం రవి గానీ, ఇటు కెనిషా గానీ స్పందించలేదు.

అయితే, ఇప్పుడు ఏకంగా దుబాయ్‌లో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లో బహిరంగంగా కలిసి కనిపించడంతో, వీరి ప్రేమాయణం నిజమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వీరి బంధం తర్వాతి దశకు చేరుకుందనడానికి ఇదే నిదర్శనమని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.


More Telugu News