జబర్దస్త్ లో విన్యాసాలు చేసిన రోజాకు పవన్ పై మాట్లాడే అర్హత ఉందా?: మంత్రి కందుల దుర్గేశ్

  • మాజీ మంత్రి రోజాపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు
  • పవన్ ను విమర్శించే నైతిక అర్హత రోజాకు లేదంటూ ఫైర్
  • పర్యాటక మంత్రిగా రోజా రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారని ప్రశ్న
  • మీకు కబ్జాలు, దొంగ వ్యాపారాలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు
  • ప్రజా సమస్యల పరిష్కారంలో పవన్ ఎప్పుడూ వెనుకడుగు వేయలేదని స్పష్టం
మాజీ మంత్రి, వైసీపీ మహిళా నేత రోజాపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్‌ను విమర్శించే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. పవన్ కల్యాణ్‌పై రోజా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ, ఆమె నైతికతను, గతంలో మంత్రిగా ఆమె పనితీరును దుర్గేశ్ సూటిగా ప్రశ్నించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ, "జబర్దస్త్ లాంటి కార్యక్రమాల్లో విన్యాసాలు చేసిన మీకు, పవన్ కల్యాణ్ గురించి మాట్లాడే అర్హత ఉందా?" అని నిలదీశారు. గత ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన రోజా, ఆ శాఖ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా కేవలం విమర్శలు చేయడం తగదని అన్నారు.

పవన్ కల్యాణ్‌కు, మీకు పోలికే లేదని దుర్గేశ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. "పవన్ కల్యాణ్‌కు సినిమాలు మాత్రమే ఉన్నాయి, కానీ మీకు కబ్జాలు, దొంగ వ్యాపారాలు ఉన్నాయి" అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పవన్ కల్యాణ్ ఎన్నడూ అలసత్వం చూపలేదని, ఆయన నిబద్ధతను ప్రశ్నించే హక్కు రోజాకు లేదని స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలు చేసే ముందు, మంత్రిగా తన హయాంలో జరిగిన అభివృద్ధిపై సమాధానం చెప్పాలని దుర్గేశ్ సవాల్ విసిరారు.


More Telugu News