Anand Dubey: నేడు భారత్-పాక్ మ్యాచ్... నిరసనగా టీవీలు పగలగొట్టిన శివసేన నేతలు

Anand Dubey Leads Protest Against India Pakistan Match
షార్ట్స్‌లో చూడండి
ఆసియా కప్ 2025లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం జరగనున్న క్రికెట్ మ్యాచ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ మ్యాచ్ ను వ్యతిరేకిస్తూ శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే వర్గం) పార్టీ కార్యకర్తలు ముంబైలో ఆందోళన చేపట్టారు. పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ దూబే నేతృత్వంలో నిరసనకారులు టీవీ సెట్లను పగలగొట్టి, కేంద్ర ప్రభుత్వానికి, బీసీసీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఆనంద్ దూబే మాట్లాడుతూ, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశమని, అలాంటి దేశంతో అన్ని రకాల సంబంధాలను తెంచుకోవాలని డిమాండ్ చేశారు. మ్యాచ్ నిర్వహణకు అనుమతి ఇవ్వడం ద్వారా మోదీ ప్రభుత్వం మన సోదరీమణుల సిందూరాన్ని అవమానిస్తోందని తీవ్రంగా ఆరోపించారు. దీనికి గుర్తుగా మహిళా కార్యకర్తలు చేతిలో సిందూరం పట్టుకుని నిరసన తెలిపారు. "దుబాయ్ లో జరగనున్న ఈ మ్యాచ్ ను మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం" అని దూబే మీడియాకు తెలిపారు.

"పహల్గామ్ లో తమ ఆప్తులను కోల్పోయిన సోదరీమణులు, తల్లులు ఈ మ్యాచ్ ను ఎలా చూడగలరు?" అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీ ఈ మ్యాచ్ ను ఆపాలి... వారి మనోభావాలతో ఆడుకోవద్దు, బీసీసీఐకి, జై షాకు తమ తప్పు తెలిసేలా విరాళాలు పంపుతున్నామని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

భారత క్రికెటర్లు కూడా ఈ మ్యాచ్ ను బహిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. "ఒకవేళ ఆటగాళ్లు ఈ మ్యాచ్ ను బహిష్కరిస్తే, మేము వారికి అండగా నిలుస్తాం. అలా కాకుండా ఆడితే మాత్రం, వారి తీరును కూడా ఖండిస్తాం" అని ఆయన స్పష్టం చేశారు.

అయితే, ఈ నిరసనల మధ్య, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
Go Back to Shorts
Anand Dubey
India vs Pakistan
Asia Cup 2025
Shiv Sena protest
Cricket match protest
Mumbai protest
Terrorism
BCCI
Jay Shah
India Pakistan relations

More Telugu News