PhonePe: నిబంధనలు బ్రేక్ చేసిన ఫోన్‌పే.. భారీ జరిమానా విధించిన ఆర్బీఐ

PhonePe Fined by RBI for Violating Rules
షార్ట్స్‌లో చూడండి
యూపీఐ చెల్లింపుల రంగంలో అగ్రగామిగా కొనసాగుతూ, త్వరలో ఐపీఓకు రాబోతున్న ఫోన్‌పే సంస్థకు అనూహ్య పరిణామం ఎదురైంది. నిబంధనల ఉల్లంఘన కారణంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఈ సంస్థకు రూ. 21 లక్షల జరిమానా విధించింది. ప్రీపెయిడ్ పేమెంట్ సాధనాలకు (పీపీఐ) సంబంధించిన నిబంధనలను ఫోన్‌పే పాటించలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది.

ఎందుకీ జరిమానా?
ముఖ్యంగా కంపెనీకి చెందిన ఎస్క్రో ఖాతాలో ఉండాల్సిన రోజువారీ నిల్వ, కస్టమర్లు, వ్యాపారులకు చెల్లించాల్సిన మొత్తం కంటే తక్కువగా ఉన్నట్లు ఆర్బీఐ తన తనిఖీల్లో గుర్తించింది. అంతేకాకుండా ఈ నిధుల కొరత విషయాన్ని తమ దృష్టికి తీసుకురావడంలో కూడా ఫోన్‌పే విఫలమైందని కేంద్ర బ్యాంకు పేర్కొంది. ఈ ఉల్లంఘనల నేపథ్యంలోనే పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్స్ చట్టం-2007 కింద ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

2023 అక్టోబర్ నుంచి 2024 డిసెంబర్ మధ్య కాలంలో ఫోన్‌పే కార్యకలాపాలపై విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించినట్లు ఆర్బీఐ తెలిపింది. నిబంధనల ఉల్లంఘనలపై ఎందుకు జరిమానా విధించకూడదో చెప్పాలంటూ కంపెనీకి నోటీసులు జారీ చేసింది. ఫోన్‌పే ఇచ్చిన సమాధానం, విచారణలో వారి వాదనలు విన్న తర్వాత ఈ నెల 10న ఈ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

కస్టమర్లపై ప్రభావం ఉండదు
అయితే, ఈ జరిమానా కేవలం నియంత్రణాపరమైన చర్య మాత్రమేనని, దీనివల్ల ఫోన్‌పే వినియోగదారుల లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఆర్బీఐ స్పష్టం చేసింది. కాగా, ఈ ఏడాది చివరిలో ఐపీఓకు వెళ్లేందుకు ఫోన్‌పే సన్నాహాలు చేసుకుంటోంది. ఇందుకోసం జేపీ మోర్గాన్, సిటీ గ్రూప్ వంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకుంది. ఇలాంటి కీలక సమయంలో ఆర్బీఐ జరిమానా విధించడం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇక‌, ప్రస్తుతం దేశంలో యూపీఐ చెల్లింపుల మార్కెట్‌లో ఫోన్‌పే సుమారు 48.64 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Go Back to Shorts
PhonePe
PhonePe RBI fine
RBI
UPI payments
prepaid payment instruments
escrow account
IPO
Reserve Bank of India
payment and settlements act 2007
digital payments

More Telugu News