SBI: ఎస్బీఐలో బాలుడి చేతివాటం.. కౌంటర్ నుంచి రూ. 5 లక్షలు మాయం

Boy Steals 5 Lakh Rupees from SBI Bank Counter in Bodhan
షార్ట్స్‌లో చూడండి
నిజామాబాద్ జిల్లా బోధన్‌ పట్టణంలోని ఎస్బీఐ శాఖలో జరిగిన ఓ భారీ చోరీ కేసు పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. బ్యాంకు క్యాష్ కౌంటర్ నుంచి ఏకంగా రూ. 5 లక్షల నగదును ఓ బాలుడు చాకచక్యంగా అపహరించినట్లు సీసీ కెమెరా ఫుటేజీలో స్పష్టమైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. ఈ నెల 8వ తేదీన తమ బ్యాంకులో రూ. 5 లక్షల నగదు కనిపించడం లేదని క్యాషియర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా బ్యాంకులోని సీసీ కెమెరా దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ ఫుటేజీలో కనిపించిన దృశ్యాలు చూసి వారు విస్తుపోయారు. బ్యాంకులో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా, ఓ బాలుడు నేరుగా నగదు కౌంటర్ వద్దకు వెళ్లి అక్కడ ఉన్న రూ. 5 లక్షల నగదును దొంగిలించినట్లు గుర్తించారు.

ఈ చోరీ వెనుక పెద్దల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలుడికి సహకరించిన మిగతా ఇద్దరిని గుర్తించేందుకు సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణను ముమ్మరం చేశారు. ఈ ఘటనపై పట్టణ సీఐ మాట్లాడుతూ, అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుని చట్టం ముందు నిలబెడతామని భరోసా ఇచ్చారు. పట్టపగలు బ్యాంకులో బాలుడు ఇంత పెద్ద మొత్తంలో నగదును దొంగిలించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Go Back to Shorts
SBI
SBI bank theft
Nizamabad
Bodhan
bank robbery
crime news
cash theft
minor boy
police investigation

More Telugu News