Nara Lokesh: చైనా సరిహద్దులో చిక్కుకున్న తెలుగు వాళ్లు... స్పందించిన నారా లోకేశ్

పవిత్ర మానస సరోవర యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులకు తిరుగు ప్రయాణంలో ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 21 మంది యాత్రికులు చైనా సరిహద్దు వద్ద చిక్కుకుపోయారు. తమను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలంటూ వారు ప్రభుత్వాలకు కన్నీటితో విజ్ఞప్తి చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే, ఈ యాత్రికుల బృందం మానస సరోవర యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని నేపాల్ మీదుగా భారత్‌కు తిరిగి రావాల్సి ఉంది. అయితే, సరిగ్గా అదే సమయంలో నేపాల్‌లో అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో వారి ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. భద్రతా కారణాల రీత్యా టూర్ ఆపరేటర్ వారిని చైనా సరిహద్దు వద్దనే నిలిపివేశారు. దీంతో ముందుకు వెళ్లలేక, వెనక్కి తిరిగి రాలేక వారంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

తమ గోడును ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు యాత్రికులు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ వీడియోను శైలజ అనే నెటిజన్ ఎక్స్ లో పంచుకున్నారు. దీనిపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. బాధితులతో తమ బృందాలు సంప్రదింపులు జరుపుతున్నాయని, వారిని ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని తన ట్వీట్ ద్వారా లోకేశ్ భరోసా ఇచ్చారు. 
Nara Lokesh
Manasa Sarovar
China border
Telugu pilgrims
stranded tourists
Nepal unrest
Andhra Pradesh
Telangana
Indian tourists
tourism

More Telugu News