Kangana Ranaut: పరువు నష్టం కేసులో కంగనా రనౌత్‌కు చుక్కెదురు

Kangana Ranaut faces setback in defamation case
షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు సర్వోన్నత న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన పరువు నష్టం కేసును రద్దు చేయాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ సందర్భంగా కంగనా తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. "మీరు చేసింది కేవలం రీట్వీట్ మాత్రమే కాదు, దానికి మసాలా కూడా జోడించారు" అంటూ జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మోహతాలతో కూడిన ధర్మాసనం ఘాటుగా స్పందించింది. కంగనా అభ్యర్థనను తోసిపుచ్చుతున్నట్లు స్పష్టం చేసింది.

2020-21 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ఈ నిరసనల్లో పాల్గొన్న 73 ఏళ్ల వృద్ధురాలు మహీందర్ కౌర్‌ను ఉద్దేశించి కంగనా రనౌత్ ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు. షాహీన్‌బాగ్ నిరసనల్లో పాల్గొన్న బిల్కిస్ బానో, రైతు ఉద్యమంలో కూడా పాల్గొన్న మహీందర్ కౌర్ ఇద్దరూ ఒక్కటేనని పేర్కొన్న ఒక పోస్ట్‌ను ఆమె రీట్వీట్ చేశారు. ఈ పోస్ట్‌తో తన పరువుకు భంగం కలిగిందని ఆరోపిస్తూ మహీందర్ కౌర్ పరువు నష్టం దావా వేశారు.

ఈ కేసును కొట్టివేయాలని కంగనా మొదట హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. దీంతో ఆమె సుప్రీంకోర్టు తలుపు తట్టారు. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఆమె పిటిషన్‌ను కొట్టివేయడంతో, ఇకపై ఆమె ఈ పరువు నష్టం కేసులో విచారణను ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది.
Go Back to Shorts
Kangana Ranaut
defamation case
supreme court
mahindar kaur
farmers protest
re-tweet
bollywood actress
bjp mp
bilkis bano
shahbag protest

More Telugu News