నేపాల్ నుంచి సొంతగడ్డకు బయల్దేరిన తెలుగువారు

నేపాల్‌లో చిక్కుకుపోయిన తెలుగు పౌరులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంలో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తీసుకున్న ప్రత్యేక చొరవ ఫలించింది. ఆయన పర్యవేక్షణలో పోఖరాలో ఉన్న 10 మంది తెలుగు వారిని ప్రత్యేక విమానంలో ఖాట్మండుకు తరలించారు. ఈ విమానం మధ్యాహ్నం 12:40 గంటలకు పోఖరా నుంచి బయల్దేరి 1:15 గంటలకు ఖాట్మండు చేరుకుంది.

అనంతరం, ఖాట్మండు నుంచి విశాఖపట్నం బయల్దేరిన ఇండిగో విమానంలోనే వీరిని రాష్ట్రానికి తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సహాయక చర్యలను మంత్రి లోకేశ్ నేరుగా ఆర్‌టీజీ‌ఎస్ వార్ రూమ్ నుంచి సమీక్షించారు. బాధితులను వీలైనంత వేగంగా, సురక్షితంగా వారి కుటుంబాల చెంతకు చేర్చడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగింది.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేశ్, ఢిల్లీ ఏపీ భవన్ ప్రత్యేకాధికారి అర్జా శ్రీకాంత్, జనసేన నాయకులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. ముఖేశ్ కుమార్ మీనా, కోన శశిధర్, కాటంనేని భాస్కర్, ప్రఖర్ జైన్ వంటి ఉన్నతాధికారులు ఈ తరలింపు ప్రక్రియను సమన్వయం చేశారు.


More Telugu News