Revanth Reddy: హైదరాబాద్‌కు హైస్పీడ్ కనెక్టివిటీ.. బెంగళూరు, చెన్నై, అమరావతికి హైస్పీడ్ రైళ్లు!

Revanth Reddy Reviews Hyderabad High Speed Rail Connectivity Project
  • తెలంగాణ మీదుగా మూడు కొత్త హైస్పీడ్ రైలు మార్గాలు
  • చెన్నై, బెంగళూరు మార్గాలకు ఇప్పటికే అలైన్‌మెంట్లు ఖరారు
  • నేడు రైల్వే అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష
  • రీజనల్ రింగ్ రోడ్డు పక్కనే రింగ్ రైలు మార్గం నిర్మాణం
  • వికారాబాద్-కృష్ణా, డోర్నకల్-గద్వాల లైన్లపైనా చర్చ
తెలంగాణ రాష్ట్రంలో రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక అడుగులు వేస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో అనుసంధానించే మూడు హైస్పీడ్ రైలు మార్గాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, అమరావతి నగరాలకు ఈ బుల్లెట్ రైలు కారిడార్లను నిర్మించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో పాటు ఇతర కొత్త రైల్వే లైన్ల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశం కోసం రైల్వే ముఖ్య ఇంజనీర్లు సైతం హైదరాబాద్‌కు చేరుకున్నట్లు సమాచారం.

రెండు మార్గాలకు అలైన్‌మెంట్ల ఖరారు
హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైలు మార్గాలకు సంబంధించిన అలైన్‌మెంట్లను అధికారులు ఇప్పటికే ఖరారు చేశారు. హైదరాబాద్-చెన్నై మార్గం కాజీపేట మీదుగా కాకుండా నార్కట్‌పల్లి, సూర్యాపేట, కోదాడ మీదుగా వెళ్లనుందని తెలిసింది. ఈ మార్గంలో తెలంగాణ పరిధిలో దాదాపు 6 నుంచి 7 స్టేషన్లు ఉండే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ మార్గాన్ని ప్రతిపాదిత నాగ్‌పూర్-హైదరాబాద్-బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు సమాంతరంగా నిర్మించనున్నారు. దీనికి సంబంధించి మూడు రకాల అలైన్‌మెంట్లను సిద్ధం చేయగా, రాష్ట్రంలో 4 నుంచి 5 స్టేషన్లు ఏర్పాటు కావొచ్చని అంచనా వేస్తున్నారు.

అమరావతి మార్గంపై కొనసాగుతున్న కసరత్తు
మరోవైపు, హైదరాబాద్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు సమాంతరంగానే హైస్పీడ్ రైలు మార్గాన్ని కూడా నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. వీటితో పాటు, రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) పక్కనే రీజనల్ రింగ్ రైలు మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు ఆర్‌ఆర్‌ఆర్ పొడవునా 45 మీటర్ల వెడల్పుతో భూమి అవసరమని రైల్వే అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు తెలిసింది. నేటి సమీక్షలో ఈ అంశాలతో పాటు వికారాబాద్-కృష్ణా, డోర్నకల్-గద్వాల, కల్వకుర్తి-మాచర్ల వంటి కొత్త రైల్వే లైన్లపైనా సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు సమాచారం.
Revanth Reddy
Hyderabad
High Speed Rail
Bullet Train
Chennai
Bangalore
Amaravati
Telangana
Railway Network
Indian Railways

More Telugu News