పవన్ కల్యాణ్ బాపట్ల పర్యటన చివరి నిమిషంలో రద్దు.. కారణం ఇదే!
- పవన్ పర్యటనకు అడ్డంకిగా వాతావరణ పరిస్థితులు
- పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక
- అటవీ అమరవీరుల దినోత్సవ కార్యక్రమాలకు బ్రేక్
వివరాల్లోకి వెళ్తే, బాపట్ల జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ ప్రయాణం సురక్షితం కాదని భావించి, అధికారులు పవన్ పర్యటనను రద్దు చేసినట్లు సమాచారం.
ఈ పర్యటనలో భాగంగా, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అటవీ అమరవీరుల త్యాగాలకు గుర్తుగా సూర్యలంక రోడ్డులోని నగరవనం పార్కులో నిర్మించిన స్థూపాన్ని పవన్ కల్యాణ్ ఆవిష్కరించాల్సి ఉంది. అనంతరం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 23 మంది అటవీ అమరవీరుల కుటుంబాలతో ప్రత్యేకంగా సమావేశమై వారికి ఆర్థిక సహాయం అందించాలని కూడా ప్రణాళిక రూపొందించారు. వీటితో పాటు, రాజమండ్రి నుంచి తెప్పించిన అరుదైన తాళపత్ర గ్రంథం మొక్కలను సూర్యలంక తీర ప్రాంతంలో నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ కార్యక్రమాలన్నీ నిలిచిపోయాయి. తదుపరి పర్యటన తేదీని త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.