పాకిస్థాన్‌లో మోటార్‌సైకిళ్ల ఉత్పత్తిని నిలిపేసిన యమహా

  • వ్యాపార విధానాల్లో మార్పుల వల్లే ఈ నిర్ణయమన్న కంపెనీ
  • దేశంలో నెలకొన్న అనిశ్చితితో కార్యకలాపాలకు బ్రేక్
  • వినియోగదారులకు స్పేర్ పార్టులు, వారంటీ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడి
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం యమహా పాకిస్థాన్‌లో తమ కార్యకలాపాలకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో, తమ మోటార్‌సైకిళ్ల తయారీని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వ్యాపార విధానాల్లో చేపడుతున్న మార్పుల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.

గత కొంతకాలంగా పాకిస్థాన్‌లో అనేక కంపెనీలు వ్యాపార నిర్వహణలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే యమహా కూడా ఉత్పత్తిని ఆపివేయాలని నిర్ణయించింది. పాకిస్థాన్‌లో యమహా బ్రాండ్‌కు ఎంతో ఆదరణ, విశ్వసనీయత ఉన్నాయి. ఇలాంటి కీలక సమయంలో కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం స్థానిక ఆటోమొబైల్ మార్కెట్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

అయితే, ఉత్పత్తిని నిలిపివేస్తున్నప్పటికీ తమ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని యమహా భరోసా ఇచ్చింది. ఇప్పటికే బైకులు కొనుగోలు చేసిన వారికి ఆఫ్టర్‌ సేల్స్‌ సేవలు, వారంటీ సేవలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. అంతేకాకుండా, అవసరమైన అన్ని స్పేర్‌ పార్టులను తమ అధీకృత డీలర్ల (YMPK) నెట్‌వర్క్‌ ద్వారా అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చింది. దీంతో ప్రస్తుత యమహా వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 


More Telugu News