Sanjay Raut: జాగ్రత్త... నేపాల్ పరిస్థితి ఏ దేశంలోనైనా రావొచ్చు: మోదీని ట్యాగ్ చేసిన సంజయ్ రౌత్

Sanjay Raut Warns of Nepal Like Situation in Any Country
  • నేపాల్‌ రాజకీయ సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ సంజయ్ రౌత్ ట్వీట్
  • ఏ దేశంలోనైనా నేపాల్ లాంటి పరిస్థితి రావచ్చని వ్యాఖ్య
  • ఖాట్మండు అల్లర్ల వీడియోను పంచుకున్న రౌత్
  • ట్వీట్‌పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ, విమర్శలు
  • అవినీతి, సోషల్ మీడియా నిషేధంపై నిరసనలతో నేపాల్‌లో సంక్షోభం
పొరుగు దేశం నేపాల్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని ఉదాహరణగా చూపిస్తూ శివసేన (యూబీటీ) నేత, ఎంపీ సంజయ్ రౌత్ కేంద్ర ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. "నేపాల్‌లో నేడు నెలకొన్న పరిస్థితి ఏ దేశంలోనైనా ఏర్పడవచ్చు, జాగ్రత్త!" అంటూ ఆయన చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

మంగళవారం ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా నేపాల్ రాజధాని ఖాట్మండులో జరిగిన అల్లర్లకు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. తన పోస్టుకు ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని నేరుగా ట్యాగ్ చేశారు. "నేపాల్ ఈరోజు ఇలా ఉంది... ఈ పరిస్థితి ఏ దేశంలో అయినా ఏర్పడవచ్చు. జాగ్రత్త! భారత్ మాతా కీ జై, వందే మాతరం" అని తన పోస్టులో పేర్కొన్నారు.

నేపాల్‌లో సోషల్ మీడియాపై నిషేధం, ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో ప్రధాని కేపీ శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ పరిణామం జరిగిన కొద్ది గంటల్లోనే సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

రౌత్ పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఆయన మద్దతుదారులు అవినీతిపై ఇది సరైన హెచ్చరిక అని సమర్థించగా, విపక్షాలు దేశంలో అల్లర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పలువురు విమర్శించారు. "ఇది బెదిరింపా, కుట్రనా లేక హెచ్చరికా? మీ కలలు భారతదేశంలో నెరవేరవు" అని అలోక్ రంజన్ అనే యూజర్ ప్రశ్నించారు. "భారత్... శ్రీలంక కాదు, ప్రయత్నించి చూడండి ఏం జరుగుతుందో!" అంటూ మరో నెటిజన్ ఘాటుగా స్పందించారు. 
Sanjay Raut
Nepal
India
Narendra Modi
Political Crisis
Social Media Ban
Corruption
Protests
K P Sharma Oli

More Telugu News